నాన్నకే పరిమితం, అమ్మ పెట్టే అన్నం తింటే...: రామ్ చరణ్ తేజ
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ హీరో, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆయన పాల్గొన్న మీలో ఎవరు కోటీశ్వరుడు షో శుక్రవారం రాత్రి ప్రసారమైంది. ఈ షోను నాగార్జున నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున రామ్ చరణ్ తేజ పలు ఆసక్తికరమైన విషయాలను రామ్ చరణ్ తేజ నుంచి రాబట్టారు. చెర్రీ అనే పేరు ఎలా వచ్చిందని నాగార్జున అడిగితే, తన అక్కకూ చెల్లెలుకూ ముద్దు పేర్లు ఉండేవని, తనకు లేదేమిటని అడిగితే నాన్న చెర్రీ అన్నారని రామ్ చరణ్ తేజ చెప్పారు.
చెర్రీ అని తనను ఎవరూ సంబోధించరని, ఇంట్లోవాళ్లు కూడా ఎవరూ ఆ పేరుతో పిలువరని, అది కేవలం తన నాన్నకే ప్రత్యేకమని, నాన్న మాత్రమే చెర్రీ అని పిలుస్తారని ఆయన చెప్పారు. ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకు రామ్ చరణ్ తేజ సమాధానమిస్తూ - తాను డైటింగ్ చేయబోనని, తాను రోజూ స్వీట్లు తింటానని అన్నాడు. అమ్మ పెట్టేది ఇంట్లో తింటే అందరూ సన్నగానే ఉంటారని ఆయన అన్నారు
రానా తాను కలిసి చదువుకున్నట్లు ఆయన తెలిపారు. తాను, రానా కలిసి ఇంటి నుంచి కేరియర్లు తినేవాళ్లమని, రానాకు ఇంటి నుంచి పెద్ద కేరియర్ వచ్చేదని, తనకు చిన్న కేరియర్ వచ్చేదని, రానా తన కేరియర్లోది అంతా తినేసి తన కేరియర్ వైపు చూసేవారని రామ్ చరణ్ తేజ అంటూ తన కేరియర్ సగం తినడం వల్లనే రానా అలా బలంగా తయారయ్యాడని చమత్కరించారు. పాత బస్తీకి వెళ్లి పలు రకాల వంటకాలు రుచి చూడడం రానా వల్లనే తనకు వచ్చిందని చెప్పారు.
ఎయిర్ లైన్స్లో తాను పెట్టుబడి మాత్రమే పెట్టానని, దాంతో ప్రత్యక్ష సంబందెం లేదని ఆయన చెప్పారు. తన మిత్రుడి ద్వారా అందులో పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. తన వద్ద ఏడు గుర్రాలు ఉన్నాయని కూడా చెప్పారు. వాటి పేర్లు కూడా చెబుతూ మిగతా గుర్రాలు తన సతీమణి ఉపాసనవని చెప్పారు.
మగధీర సినిమా గురించి కూడా రామ్ చరణ్ చెప్పారు. దర్శకుడు రాజమౌళి కారణంగా తనకు రెండో సినిమాలోనే 15 సినిమాలు చేస్తే గానీ రాని అనుభవం వచ్చిందని ఆయన చెప్పారు. అలాంటి అవకాశం దక్కడం అదృష్టమని ఆయన అన్నారు. అయితే, తాను నటించే తర్వాతి సినిమాలు కూడా ఆ స్థాయిలో ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంలో జోక్యం చేసుకుని నాగార్జున - అది సాధ్యం కాదని, తనకు శివ సినిమా వల్ల అటువంటిదే జరిగిందని చెప్పారు. అవి ట్రెండ్ సెట్టర్స్ అని, సినీ చరిత్రలో నిలిచిపోతాయని, మనం నటించే అన్ని సినిమాలు రావడం సాధ్యం కాదని అన్నారు.
తాను శ్రీను వైట్లతో సినిమా చేస్తున్నట్లు రామ్ చరణ్ తేజ చెప్పారు. శ్రీను వైట్ల కామెడీ ట్రాక్ బాగుంటుందని నాగార్జునతో పాటు రామ్ చరణ్ కూడా అంటూ మహేష్ బాబు నటించిన దూకుడు సినిమాను గుర్తు చేసుకున్నారు. కామెడీ చేస్తేనే నటనలో పరిపూర్ణత సాధించినట్లని నాగార్జున అన్నారు.