మీ ఫ్యామిలీ పశ్చాత్తాపపడేలా ప్రతీకారం: ఉద్యోగులపై చెవిరెడ్డి సంచలనం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం అధికారంలోకి వస్తే ఉద్యోగుల కుటుంబాలు పశ్చాత్తాప పడేలా ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం అధికారంలోకి వస్తే ఉద్యోగుల కుటుంబాలు పశ్చాత్తాప పడేలా ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ భయానికి పారిపోయాడు: బాబుపై పార్థసారథి సెటైర్లు
తమ పార్టీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ను కొందరు అధికారులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, అనవసరంగా, అన్యాయంగా అధికార పార్టీ మద్దతు ఉంది కదా అని వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఏడాదిలోగా అధికారంలోకి.. లెక్క తేలుస్తాం
ఏడాదిలోగా తాము అధికారంలోకి వస్తామని చెవిరెడ్డి భాస్కర రెడ్డి చెప్పారు. తప్పు చేసిన అధికారులను వెంటాడుతామని తేల్చి చెప్పారు. ఆ రోజు ఎందుకు అలా చేశారో లెక్క తేలుస్తామని వ్యాఖ్యానించారు.
ఎవరైనా వదిలిపెట్టం
ఎమ్మార్వో అయినా, మరే అధికారి అయినా వదిలి పెట్టేది లేదని చెవిరెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రజాప్రతినిధులను వేధింపులకు గురి చేసిన ఉద్యోగుల కుటుంబాలు పశ్చాత్తాపపడేలా చేస్తామన్నారు.
అసెంబ్లీ లీకేజీలపై.. అంబటి
అసెంబ్లీలో లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలని వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వేరుగా డిమాండ్ చేశారు. రాజధానిలోని అన్ని నిర్మాణాలను సిబిఐ విచారణలో చేర్చాలన్నారు. చంద్రబాబు ఛాంబర్ బుల్లెట్ ప్రూఫ్, లాంచర్ ప్రూఫ్ అని చెప్పి, జగన్ ఛాంబర్ మాత్రం వాటర్ ప్రూఫ్ కూడా లేకుండా చేశారన్నారు.
కుట్ర చేశామని నీచపు మాటలు
తేలికపాటి వర్షానికే జగన్ ఛాంబర్ జలమయమైందని, సచివాలయంలో కూడా అదే పరిస్థితి ఉందని అంబటి విమర్శించారు. లీకేజీపై వైసిపి కుట్ర చేసిందంటూ నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
జగన్పై నెపం వేసి తప్పించుకునే ప్రయత్నాలు
వైఫల్యాలను ఎత్తిచూపిన ప్రతిసారి అలానే చేస్తున్నారని, తుని ఘటన, అరటి తోట దగ్ధం సమయంలోనూ అలానే మాట్లాడారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఆ ఘటనలకు సంబంధించి ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదని, జగన్పై నెపం నెట్టి అవినీతి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు. అసెంబ్లీ, సచివాలయంలో కారింది నీళ్లు కాదని, టిడిపి అవినీతి అన్నారు.