భూమన అరెస్టు పుకార్లు: 7 గంటలు విచారించి వదిలేశారు
అమరావతి: తుని విధ్వంసం ఘటనకు సంబంధించి వైపీసీ నేత భూమన కరుణాకర్రెడ్డిని సిఐడి అధికారులు బుధవారంనాడు 7 గంటల పాటు విచారించారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని తొలుత పుకార్లు వ్యాపించాయి. సీఐడి ఆఫీస్ నుంచి ఏఎస్పీ హరికృష్ణ బయటకు వెళ్లారు.
అయితే భూమన కరుణాకరరెడ్డి బయటికి రాకపోవటంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందారు. ఆయతో పాటు పాటు సీఐడీ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నారాయణస్వామిలు ఆయన రాకకోసం ఎదురు చూశారు. భూమనను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలు రావడంతో సీఐడీ కార్యాలయానికి వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.
అయితే, భూమన కరుణాకర్ రెడ్డిని వదిలేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అవసరమైతే భూమనను మళ్లీ విచారిస్తామని సిఐడి అధికారులు చెప్పారు.
అంతకు ముందు వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ భూమనను అరెస్ట్ చేశారో లేదో సీఐడీ వివరణ ఇవ్వాలని కోరారు. ఆయన్ను అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. తుని ఘటనలో విచారణ పేరుతో ఆయనను గుంటూరుకు తీసుకొచ్చి వేధిస్తున్నారని ఆరోపించారు.
ఇక్కడ పోలీసులు చేస్తున్న హడావుడి చూస్తుంటే భూమనను అరెస్టు చేస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలం కావడంతో పాటు ఓటుకు నోటు కేసు తదితర అంశాల్లో చంద్రబాబు ప్రభుత్వంను వైసీపీ దోషిగా నిలబెట్టనుందని అన్నారు.
దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ డ్రామా చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాలతో ప్రత్యేక హోదాను పక్కన పెట్టించి ప్యాకేజి కోసం మంత్రులతో బేరసారాలు ఆడిస్తున్నారని, రేపు హోదా కోసం ప్రజల్లో తిరుగుబాటు వస్తే, వైసీపీ దానికి నాయకత్వం వహిస్తుందని తెలిసే, దాన్ని పక్కదోవ పట్టించడానికి వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని అన్నారు.
కేవలం అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ను ఎదుర్కొనేందుకు భూమనను బూచిగా చూపి గట్టెక్కాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని, ఎందుకంటే సీఐడీ కార్యాలయం ఎదుట భారీగా మఫ్టీలో పోలీసులను మోహరించారని ఆయన తెలిపారు.
హడావుడిగా అర్ధరాత్రి భారీ సంఖ్యలో పోలీసు బలగాలు
గుంటూరుకు హడావుడిగా అర్ధరాత్రి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను తరలించారని, ఇదంతా చూస్తుంటే తమకు భూమనను అరెస్ట్ చేస్తారేమోనన్న అనుమానాలు వస్తున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. దీనిపై లోపలున్న పోలీసులను అడిగినా తమకు ఎలాంటి సమాచారం లేదని వాళ్లు చెబుతున్నారని అన్నారు.
విచారణ తర్వాత కరుణాకరరెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉంటే మాత్రం తప్పనిసరిగా తమకు ముందుగా సమాచారం ఇవ్వాలని అంబటి అన్నారు. భూమన కరుణాకరరెడ్డిని రహస్యంగా తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, ఇప్పటివరకు మాత్రం అరెస్ట్ చేస్తామని గానీ, చేయబోమని గానీ ఏమీ చెప్పలేదని అన్నారు.
సాధారణంగా సీఎం చంద్రబాబు, లోకేష్ ఏం చెబితే సీఐడీ వాళ్లు అదే చేస్తారని, వాళ్లు ఏం చెప్పారో చూడాలని అంబటి అన్నారు. కరుణాకరరెడ్డిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలిస్తారని టీడీపీ నేత వర్ల రామయ్య చెప్పారంటే చంద్రబాబు అలాగే ఆదేశించారేమోనని అన్నారు. కాగా, భూమన అరెస్ట్ వార్తలు వెలువడుతుండడంతో వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.