మూడు సంవత్సరాల తర్వాత వాస్తవాలను గుర్తిస్తున్న ముఖ్యమంత్రి జగన్?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు సంవత్సరాల తర్వాత పార్టీలోకానీ, ప్రభుత్వంలోకానీ అసలు వాస్తవాలను గుర్తిస్తున్నారని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. రెండు సంవత్సరాల విలువైన కాలాన్ని కరోనా తీసుకుపోవడం, ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల్లో కూడా శ్రేణులతో మమేకవడం తక్కువగా జరిగింది. ప్రశాంత్ కిషోర్ స్థానంలో వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న రుషిరాజ్సింగ్ తన నివేదికలో కూడా పార్టీ కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని, వారికోసం ప్రత్యేకంగా ఏదైనా ఒక పథకాన్ని కానీ, ఎన్నికలకు ఒక ప్రణాళిక కానీ రూపొందించాలంటూ నివేదిక ఇచ్చారు.

వైసీపీ కార్యకర్తల కోసం ఒక ప్రణాళిక?
ఈనెల 8, 9 తేదీల్లో పార్టీ ప్లీనరీ జరుగుతున్న సందర్భంగా ఆ కార్యక్రమంలోనే వారికి చేయాల్సినవి ప్రకటించాలనుకున్నప్పటికీ అది సరైన సందర్భంకాదనే ఉద్దేశంతో వాయిదా వేసినట్లు సమాచారం. ప్లీనరీ ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలతో మమేకమయ్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. నేతలకన్నా, నాయకులకన్నా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచేది కార్యకర్తలే. ఆ కార్యకర్తల బలమే లేకపోతే అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయం ప్రతిపార్టీలోను వ్యక్తమవుతుంటుంది. అటువంటి కార్యకర్తలు నిర్లక్ష్యానికి గురికాకుండా వారికి ఏమేం చేయాలనే అంశంపై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఒక ప్రణాళిక రూపొందించారని, నేతలతో చర్చించి దాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కార్యకర్తలను దరిచేరనీయని ఎమ్మెల్యేలు?
బూత్ స్థాయి నుంచి ఏ పార్టీ అయినా బలోపేతం కావాలంటే దానికి కార్యకర్తలే కారకులవుతారు. రాబోయే ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటువంటి కార్యకర్తలు పార్టీకి, ఎమ్మెల్యేలకు దూరమవుతున్నారని రుషిరాజ్సింగ్ నివేదికలో పేర్కొన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కార్యకర్తలను దరిచేరనీయడంలేదని, గత ఎన్నికల్లో విజయం కోసం కృషిచేసి ఇప్పుడు అనాదరణకు గురవుతున్నామనే అసంతృప్తిలో కార్యకర్తలున్నారని వెల్లడించారు.

ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలంటే ఏం చేయాలి?
చాలా తక్కువ నియోజకవర్గాల్లోనే ఎమ్మెల్యేలు కార్యకర్తలతో మమేకమవుతున్నారని, అటువంటి నియోజకవర్గాల్లో పార్టీకి ఇబ్బంది లేదని చెప్పినట్లు తెలుస్తోంది. వాలంటీర్లంతా తమ పార్టీ కార్యకర్తలే అని విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు లాంటి నేతలు ఇప్పటికే ప్రకటించారు. వారికి ఏదో ఒకరూపంలో ప్రభుత్వపరంగా ఉపాధి చూపించారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలంటే ఏ పార్టీకి సాధ్యంకాని పని. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం వైసీపీలోని ప్రతి కార్యకర్తకు న్యాయంచేయాలనే దృక్పథంతో ఉన్నారని, కచ్చితంగా చేస్తారని పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications