విజయవాడ కు సీఎంలు కేసీఆర్ - నితీశ్ : కీలక సమావేశం..!!
విజయవాడ కీలక రాజకీయ సమీకరణాలకు కేంద్రంగా మారనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. బీహార్ సీఎం నితీశ్ విజయవాడకు రానున్నారు. జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఈ ఇద్దరు నేతలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా బీహార్ సీఎం నితీశ్ పలు పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఇప్పుడు.. వీరిని విజయవాడకు రావాల్సిందిగా ఆహ్వానం అందింది. అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఈ మహా సభలకు 29 రాష్ట్రాల నుంచి సీపీఐ నేతలు హాజరవుతున్నారు. జాతీయ స్థాయిలో సీపీఐ ముఖ్య నేతలు విజయవాడకు రానున్నారు.
ఈ సమయంలోనే సమావేశాలకు రావాల్సిందిగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సీపీఐ ఆహ్వానించింది. అందులో తెలంగాణ..బీహార్..కేరళ..తమిళనాడు సీఎంలు ఉన్నారు. సీపీఐ నేతలతో పాటు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, ఆర్ఎస్పీ, ఫార్వార్డ్ బ్లాక్ నేతలు కూడా ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. తాజాగా.. మునుగోడు ఉప ఎన్నిక కోసం సీపీఐ - టీఆర్ఎస్ కలిశాయి. బీజేపీని ఓడించటం కోసం టీఆర్ఎస్ తో కలుస్తున్నట్లు సీపీఐ నేతలు ప్రకటించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేసారు. ఇదే సమయంలో..విజయవాడకు తెలంగాణ ముఖ్యమంత్రి వస్తున్నారనే సమాచారం ఏపీ రాజకీయాల్లోనూ ఆసక్తి కరంగా మారింది.

మూడేళ్ల క్రితం సీఎం కేసీఆర్ విజయవాడ వచ్చారు. ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన నివాసానికి కేసీఆర్ వచ్చారు. 2019 జూన్ లో కేసీఆర్ ఏపీ సీఎం తో సమావేవమయ్యారు. ఆ తరువాత హైదరాబాద్ కేంద్రంగా రెండు రాష్ట్రాల అంశాల పైన ఇద్దరు సీఎంలు అధికారులతో సమీక్షలు చేసారు. కానీ, ఆ ప్రయత్నాలు తరువాతి కాలంలో కొనసాగలేదు. ఇక, ఇప్పుడు సీపీఐ జాతీయ మహా సభల్లో భాగంగా అక్టోబర్ 14వ తేదీన భారీ ర్యాలీ, 15న బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి హాజరవుతారని సీపీఐ నేతలు చెబుతున్నారు. దీంతో.. కేసీఆర్ విజయవాడ పర్యటన ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications