నల్లగొండ జిల్లా: పెంపుడు కోడి దాడిలో పాప దుర్మరణం
నల్లగొండ: నల్లగొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెంపుడు కోడి దాడి చేయడంతో ఎనిమిది నెలల పాప మరణించింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం లక్ష్మీదేవిగూడంలో ఆదివారంనాడు వెలుగు చూసింది.
గ్రామానికి చెందిన కొంపల్లి సైదులు, గీతలకు ఎనిమిది నెలల క్రితం మొదటి సంతానంగా పాప పుట్టింది. పాప పేరు జాహ్నవి. వారిది వ్యవసాయ కుటుంబం. దీంతో వాళ్లు పెరట్లో కోళ్లను పెంచుతున్నారు. గురువారం ఉదయం తల్లి పాపను ఇంటి వరండాలో పడుకోబెట్టి పనులు చేసుకుంటోంది.

ఆ సమయంలో కోడి పాప వద్దకు వచ్చి తలపై బలంగా పొడిచింది. దీంతో పాపకు రక్తస్రావమైంది. ఇది గమనించి కుటుంబ సభ్యులు పాపను స్థానిక వైద్యుడి వద్దకు వెళ్లి చికిత్స చేయించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు
శనివారంనాడు జాహ్నవి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో పాపను హైదరాబాద్ తీసుకుని వెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే, చికిత్స పొందుతూ జాహ్నవి అదే రోజు రాత్రి మరణించింది.












Click it and Unblock the Notifications