సర్వేతోనే మనస్థాపం, గంటాపై లగడపాటికి ఎందుకంత కోపం?: భీమిలిపై చినరాజప్ప హామీ
Recommended Video

విశాఖపట్నం: మంత్రి గంటా శ్రీనివాస రావు చల్లబడ్డారు. ఇటీవల పార్టీలోని రాజకీయ పరిణామాలు, లగడపాటి రాజగోపాల్కు చెందిన సంస్థ సర్వే ఫలితాలపై గంటా అసంతృప్తితో ఉన్నారు. దీంతో విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
అయితే, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప.. గంటా నివాసానికి వెళ్లి ఆయనతో మంతనాలు జరిపారు. ఈ చర్చల్లో గంటా చల్లబడ్డారు. దీంతో అంతా సర్దుకుంది. చంద్రబాబు పర్యటనలో గంటా పాల్గొంటారు. గంటాతో భేటీ అనంతరం చినరాజప్ప మీడియాతో మాట్లాడారు.

తాము చేయించాలనుకున్న సర్వేను గంటా శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్న భీమిలి నియోజకవర్గంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేయించడం ఏమిటని చినరాజప్ప మండిపడ్డారు. లగడపాటికి గంటా పైన అంత కోపం ఎందుకని ప్రశ్నించారు. సర్వే ఫలితాలు చూసి గంటా మనస్తాపానికి గురయ్యారన్నారు. ఇది సహజమే అన్నారు. ఆ సర్వే ఫలితాలు అలక, ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయన్నారు.
ఎవరు ఏమన్నా వచ్చే ఎన్నికల్లో మంత్రి గంటా శ్రీనివాస రావు భీమిలి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని చినరాజప్ప స్పష్టం చేశారు. అనకాపల్లి నుంచి అవంతి శ్రీనివాస్ మళ్లీ బరిలో నిలుస్తారని చెప్పారు. గంటా అలకలో తప్పేమీ లేదన్నారు. అసలు ఆయనకు ఇబ్బంది కలిగించేలా సర్వే ఉందన్నారు. పనిచేసే మంత్రిపై ఇలాంటి సర్వే రావడం దురదృష్టకరమన్నారు.
మూడు నాలుగు రోజులుగా గంటా అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో విశాఖ ఇంచార్జ్ మంత్రి చినరాజప్ప రంగంలోకి దిగారు. చినరాజప్ప వెంట యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్బాబు, గాజువాక ఎమ్మెల్యే పళ్ళ శ్రీనివాస్, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ తదితరులు గంటా ఇంటికి వచ్చారు.
అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో గంటా ఫోన్లో మాట్లాడారు. కాసేపటి తర్వాత గంటా శ్రీనివాసరావు, చినరాజప్ప సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సర్వే కారణంగానే గంటా మనస్తాపం చెందారని, వచ్చే ఎన్నికల్లోనూ ఆయన భీమిలి నుంచే పోటీ చేస్తారని చినరాజప్ప తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలోనూ ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications