మౌనంగా జగన్ సిఎం అయ్యేవారే: చింతామోహన్
రాష్ట్ర విభజనలో తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ ప్రమేయం లేదన్నారు. చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఫల్యాలవల్లే విభజన తలెత్తిందని ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి బతికున్నా ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తిరుపతిలో గురువారం నెహ్రూ జయంతి సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చుంటే తెరాస పుట్టేది కాదన్నారు. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు ప్రయత్నించకుంటే విభజనకు బీజం పడేది కాదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని తగ్గించడానికి ఎవరినెలా సర్దుబాటు చేయాలో వైఎస్కు బాగా తెలుసని, ఆయన ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని చెప్పారు.
వైఎస్ కుమారుడు జగన్ కొంతకాలం మౌనంగా ఉన్నా సీఎం అయ్యేవాడన్నారు. విభజన ఇష్టంలేని అధిష్ఠానం, ఉద్యమాన్ని తగ్గించేలా కిరణ్ను సీఎంను చేసినా తెలంగాణ నేతలను కలుపుకొని పోవడంలో విఫలమయ్యారని చెప్పారు. తెలంగాణ ఎంపీలను అరెస్టు చేయించారన్నారు.
ఇలా వీరంతా చేసిన పొరపాట్లు విభజనకు కారణమైతే నింద మాత్రం సోనియాపై వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఆమెకు టీడీపీ సమాధికడితే అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ నేతలు ఇళ్లల్లో దాక్కున్నారని ధ్వజమెత్తారు.