బాబు ప్రభుత్వం కూలుతుందని చింతా సంచలనం: ట్యాపింగ్ టెక్నాలజీపై యనమల
తిరుపతి/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబు ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయమని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేకపోయారని ఆయన విమర్శించారు. నెల్లూరు జిల్లాలోని దుగ్గరాజుపట్నం ఓడరేవు సాధన కోసం పోరాటం చేస్తానని ఆనయ చెప్పారు. దాని కోసం తాను సోమవారం నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు చింతామోహన్ చెప్పారు.

వికీలీక్స్ వెల్లడించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, ట్యాపింగ్ కోసం సింగపూర్ హ్యాకింగ్ టీమ్కు తమ ఏపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, వారి తొత్తులుగా ఉన్న చానెళ్ల కుట్ర చేస్తున్నాయని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కథనాలకు, మెయిల్స్కు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి సబంధంలేదని మంత్రి యనమల స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications