పవన్ కళ్యాణ్ వల్లే ఆ కాస్త: చిరును ఏకేసిన ఎమ్మెల్యే
హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పైన తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పైన చిరంజీవి శనివారం విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
దీనికి చింతమనేని కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ప్రజలు ఛీకొట్టినా చిరంజీవికి బుద్ధిరాకపోవడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్లే చిరంజీవిని కాస్తోకూస్తో గౌరవిస్తున్నారన్నారు. దానిని ఆయన నిలుపుకోవాలని హితవు పలికారు. చిరంజీవి తీరు మార్చుకోవాలని సూచించారు.

విమానాల్లో హైదరాబాదు నుంచి ఢిల్లీకి చక్కర్లు కొట్టడం మినహా చంద్రబాబు చేస్తున్నదేమీ లేదని చిరంజీవి విమర్శించిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలో ఏదైనా చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంటే ఇక మళ్లీ ఆ చిత్రం ఉండదని సంతోషంగా సంబరాలు చేసుకుంటారని, ఇప్పుడు ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకుందన్నారు. బాబు చిత్రం ఎంతోకాలం ఆడదన్నారు. కాపులు, బ్రాహ్మణులు, బిసిలను వాగ్దానాలతో మభ్యపెట్టి మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ముందున్న లక్ష్యమన్నారు. టీడీపీ హత్యా రాజకీయాలు చేస్తోందని చర్చకు లేవనెత్తిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చివరకు పాలకపక్షం ఎదురు ప్రశ్నలతో దాడి చేసేసరికి వెనుకడుగు వేసిందన్నారు. రుణమాఫీ భారం తప్పించుకోవడానికి చంద్రబాబు అనేక నిబంధనలు విధిస్తున్నారని చిరు మండిపడ్డారు. దీనిపై చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications