హైదరాబాద్ను యుటి చేయాలని నేనంటే, కాంగ్రెస్ నేతలే..: చిరంజీవి విసుర్లు
గుంటూరు: హైదరాబాద్ను తాను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) చేయాలని కోరితే సమైక్యం పేరుతో కొందరు కాంగ్రెస్ నేతలే తప్పుదారి పట్టించారని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి అన్నారు. హైదరాబాదును యుటిగా చేయాలని చిరంజీవి కాంగ్రెసు అధిష్టానంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే.
ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడు తాను ఏపీకి చెందిన సభ్యుడిని కానంటూ తప్పించుకుంటున్నారని చిరంజీవి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల పొట్టకొట్టి వారి గుండెలపై రాజధాని నిర్మించాలని చూస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ దొంగ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, ఆ పార్టీ నేతలను తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఆంధ్రుల హక్కులను కాలరాయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈనెల 13 తర్వాత ప్రభుత్వ పాలనపై వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని రఘువీరా తెలిపారు.
రైతుల గురించి అందరూ మాట్లాడుతున్నారని కానీ వారి బాధలు పట్టించుకునే నాథుడే లేడని కాంగ్రెస్ నేత, మాజీమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బీజేపీ గంటకో మాట.. ఊరికో ప్రకటన చేస్తోందన్నారు. పది నెలల్లో ప్రభుత్వ చేసింది శూన్యమని ఆయన అన్నారు.