నిన్ను అసెంబ్లీకి పంపించే బాధ్యత నాది... నువ్వు ప్రశాంతంగా ఉండు!!
సినీ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ నేతగా మారడానికి జనసేన ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీచేయకుండా ఏపీలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో పోటీకి దిగినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఆ పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యేనే ఎన్నికయ్యారు. పవన్ కూడా రెండు నియోజకవర్గాల్లో ఓటమిపాలు కావడం జనసేన శ్రేణులను నిరుత్సాహానికి గురిచేసింది.

టీడీపీతో పొత్తు ఖరారు?
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీచేయడం దాదాపుగా ఖరారైంది. నిన్నటివరకు తమ్ముడు పార్టీ పెట్టినా ఎవరి మనసు నొప్పించకూడదు.. తాను అందరివాడుగా ఉండాలనే ఉద్దేశంతో బహిరంగంగా కామెంట్లు చేయలేదు. అయితే రాన్రాను చిరంజీవి నెమ్మదిగా స్వరం పెంచుకుంటూ వచ్చారు. బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఒకవైపు వైసీపీ, మరోవైపు బీజేపీ చిరంజీవిని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేశాయికానీ సున్నితంగా వారిచ్చిన ఆఫర్లను తిరస్కరించారు. తాను కేవలం సినిమా రంగానికే పరిమితమవుతానని స్పష్టం చేశారు.

తన బలాన్ని తమ్ముడికి బదలాయించేలా..
అభిమానుల బలం, ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో అండగా నిలబడిన నేతలు చిరంజీవితో కలిసే ఉన్నారు. ఆ బలాన్ని తమ్ముడికి బదలాయించాలనే యోచనలో చిరు ఉన్నారు. తన తమ్ముణ్ని విమర్శించేవారెవరైనా సరే.. తర్వాత తనను కలవడానికి రావద్దని ఇటీవలే ప్రకటించారు. అంతేకాక పరోక్షంగా తన మద్దతు పవన్ కల్యాణ్ కే ఉంటుందన్నారు. చిరంజీవికైనా, పవన్ కల్యాణ్ కైనా ఉత్తరాంధ్రలో అభిమానులు ఎక్కువ. గత ఎన్నికల్లో అభిమానులు ఓటర్లుగా మారకపోవడాన్ని గుర్తించిన పవన్ ఈసారి అభిమానుల మొత్తాన్నిజనసేన పార్టీకి ఓటర్లుగా, కార్యకర్తలుగా మార్చాలని నిర్ణయించుకున్నారు. తమకు బలమున్నచోట శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి, విశ్వవిద్యాలయాలు, కళాశాలల నుంచి యువత ఈ కార్యక్రమానికి తరలి రానుంది.

మూడు జిల్లాలను ప్రభావితం చేయవచ్చు..
భీమిలీలో స్థలం కొనుగోలు చేశాను.. ఇల్లు కట్టుకొని విశాఖ పౌరుడిగా ఉంటానని చిరు ప్రకటనలో అంతరార్థాన్ని రాజకీయ విశ్లేషకులు గ్రహించారు. ఎట్టి పరిస్థితుల్లోను తన తమ్ముణ్ని అసెంబ్లీలో అడుగుపెట్టించడమే కాకుండా అతనితోపాటు పదుల సంఖ్యలో జనసేన ఎమ్మెల్యేలను విజయం సాధించేలా తెరవెనక సహకారాన్ని అందించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ కూడా మొదటి నుంచి విశాఖపై దృష్టిసారించారు. ప్రభుత్వం కూడా ఇక్కడే ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటోంది. ఈ రెండు పార్టీల మధ్య పోరు హోరాహోరీగా జరుగుతోంది. ఇటువంటి తరుణంలో బహిరంగంగా తాను ఏమీ వ్యక్తపరచకపోయినా భీమిలీలో ఉండటంద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను ప్రభావితం చేయవచ్చని, పవన్ కు మద్దతును చేకూర్చవచ్చనే భావనలోనే చిరంజీవి ప్రకటించారని సీనియర్ రాజకీయ వేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications