శత్రువు కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు: నిషిత్ మృతిపై చిరంజీవి ఆవేదన!
ఇలాంటి పరిస్థితి శత్రువుకు కూడా రావద్దని అన్నారు. ఎదిగొచ్చిన కుమారుడు దూరమైపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.
హైదరాబాద్: ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతి ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది. రోడ్డు ప్రమాదంలో నిషిత్ మృతి చెందడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో.. తీవ్ర శోకసముద్రంలో మునిగిన నిషిత్ కుటుంబాన్ని బుధవారం ఉదయం రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రమాద ఘటనపై చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి శత్రువుకు కూడా రావద్దని అన్నారు. ఎదిగొచ్చిన కుమారుడు దూరమైపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. కొడుకును కోల్పోయిన విషాదం నుంచి నారాయణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
కాగా, అంతకుముందు తెలంగాణ మంత్రి హరీశ్ రావు అపోలో ఆసుపత్రికి చేరుకుని.. ఏర్పాట్లను దగ్గరుండి పరామర్శించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. వీరితో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కేంద్రమంత్రి సుజనా చౌదరి తదితరులు మంత్రి కుటుంబాన్ని పరామర్శించారు.