కెసిఆర్ పిలిచారు, కెటిఆర్తో మాట్లాడా: చిరు 'అభిలాష'
హైదరాబాద్: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారని, తాను కెసిఆర్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశానని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు చిరంజీవి సోమవారం ఢిల్లీలో చెప్పారు. చిరంజీవి, ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం తదితరులు ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, అధినేత్రి సోనియా గాంధీలను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ చిరు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా మెలగాలన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటి రామారావుకుతో తాను రెండు రోజుల క్రితమే మాట్లాడానని చెప్పారు. ప్రభుత్వంలో లేకపోయినా తాము ప్రజల పక్షాన నిలుస్తామన్నారు. భౌగోళికంగా తెలుగు వారు విడిపోయినా సామరస్యంగా ఉండాలనేది తన అభిలాష అన్నారు.
అలాంటి వాతావరణం వచ్చేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా రాష్ట్రాల అభివృద్ధి కోసం సహకరిస్తుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తమవంతు కృషి చేస్తామన్నారు. ఎన్నో ఉద్యమాల కారణంగా తెలంగాణ ఏర్పడిందని చెప్పారు.
అరవయ్యేళ్ల తెలంగాణ కల సాకారమైన వేళ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలని రఘువీరా రెడ్డి అన్నారు. తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు సోనియా గాంధీకి వివరించామన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలు నెరవేరేలా ఓ కమిటీ వేయాలని సూచించినట్లు చెప్పారు. ఇందుకోసం ప్రధానికి లేఖ రాయాలని సోనియాకు సూచించామన్నారు.