పవన్లా: క్యాన్సర్ చిన్నారికి చిరంజీవి పరామర్శ, కంటతడి.. 150వ సినిమాలో ఛాన్స్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గురువారం నాడు క్యాన్సర్తో బాధపడుతున్న ఓ చిన్నారిని పరామర్శించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని ఆయన పరామర్శించారు. బాలుడి పేరు బాలు.
తనను పరామర్శించేందుకు చిరంజీవి రావడంతో చిన్నారి బాలు ఆనందించాడు. బాలు కుటుంబ సభ్యులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు. బాలు అదిలాబాద్ జిల్లాకు చెందిన వాడు. అతని వయస్సు పదేళ్లు. అతను క్యాన్సర్తో బాధపడుతున్నాడు. బాలు తన ఆరాధ్య నటుడు చిరంజీవిని చూడాలని ఆయన కోరుకున్నాడు. దీంతో చిరు వచ్చి పరామర్శించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. అదిలాబాద్ జిల్లా జిన్నారంకు చెందిన బాలు క్యాన్సర్తో బాధపడుతున్నాడని, ఆయన తనను చూడాలని అభిలాష వ్యక్తం చేశారని ఓ చానల్లో చూశానని, దీంతో ఈ రోజు వచ్చానని అన్నారు. ఆడుతూ పాడుతూ ఉండే ఇలాంటి చిన్నారులకు క్యాన్సర్ రావడం బాధాకరమన్నారు. ఇలాంటి వారికి ఆర్థిక సాయం చేసేందుకు అందరు ముందుకు రావాలన్నారు.
ఈ బాలుడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవి బాలుడికి ముద్దు ఇచ్చారు. బాలుడికి పూర్తిగా నయమయ్యాక తన ఇంటికి రావాలని ఆహ్వానించారు. డ్యాన్స్ చేయాలని బాలుడు కోరగా.. ఇంటికి వస్తే, ఎవరు ఇంట్లో లేని సమయంలో మిద్దరం కలిసి డ్యాన్స్ చేద్దామని చిరంజీవి అన్నారు. 150వ సినిమాలో నటిస్తానని, అందులో బాలుడికి ఛాన్స్ ఇస్తానని చెప్పారు. ఈ సమయంలో బాలుడు కంటతడి పెట్టారు. బాలుడికి చిరు బహుమతులు తెచ్చారు.
'మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా'
బాలుడుకి ఇష్టమైన విషయాలను చిరంజీవి అడిగి తెలుసుకున్నారు. ఇంద్ర సినిమాలోని డైలాగ్ తనకు ఇష్టమని బాలుడు చెప్పారు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగ్ బాలుడు కొట్టాడు. చిరంజీవి దానిని మరోసారి అడిగి డైలాగ్ కొట్టించుకున్నారు. తర్వాత చూడాలని ఉంది సినిమా చూశావా అని అడిగారు.
చి.రం.జీ.వి. అంటే...
ఈ సందర్భంగా బాలుడు కుటంబ సభ్యులు మాట్లాడుతూ.. తాము బాలుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులం అయితే, చిరంజీవిగారు పునర్జన్మ ఇచ్చారన్నారు. చిరంజీవి అంటి 'చి'త్ర 'రం'గానికి 'జీ'వంపోసిన 'వి'ధేయుడు అన్నారు. అన్నయ్యను చూసి కష్టమేంటో నేర్చుకోవాలని అన్నారు. కట్టెలు మోసిన వ్యక్తి ఈనాడు ఎంతో ఎదిగారన్నారు.