చిరు గైర్హాజరు, నరకంలో హీరో బెటర్: రఘువీరా
విజయవాడ: ఎన్నికల్లో అపజయాన్ని సమీక్షించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ నాయకులు సమావేశమయ్యారు. మంగళవారం జరిగిన ఈ సమావేశానికి మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి హాజరు కాలేదు. ఐరోపా పర్యటనలో ఉన్న కారణంగా ఆయన సమావేశానికి రాలేపోయారు. కెవిపి రామచందర్ రావు, సుబ్బిరామిరెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి, సి. రామచంద్రయ్య తదితరులు హాజరయ్యారు.
సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి ప్రసంగించారు. ప్రతికూల పరిస్థితిలో పార్టీకి అండగా నిలిచినవారికి ఆయన కృతజ్ఝతలు తెలిపారు. స్వర్గంలో బానిస కన్నా నరకంలో హీరో బెటర్ అని ఆయన అన్నారు. తెలుగుదేశం, బిజెపిల్లోకి వెళ్లినవారు కట్టు బానిసల్లా బతుకుతున్నారని ఆయన అన్నారు.
పార్టీ పటిష్టతకు వ్యూహాన్ని రచించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఏం చేయాలి, జాతీయ స్థాయిలో ఏం చేయాలనేది ఆలోచించుకోవాలని ఆయన అన్నారు. సమావేశంలో మనసు విప్పి మాట్లాడుకుందామని ఆయన సూచించారు. ఆత్మస్తుతి, పరనింద అవసరం లేదని అన్నారు. పొరపొచ్చాలు లేకుండా మాట్లాడుకుందామని ఆయన అన్నారు. ఓడిపోతామని తెలిసినా పార్టీ గుర్తుపై పోటీ చేసినందుకు గర్వపడుతున్నానని ఆయన అన్నారు.
సమావేశంలో టిడిపి, బిజెపి ఎన్నికల ప్రణాళిక ప్రతులను పంచిపెట్టారు. హిమాచల్ ప్రదేశ్ మృతులకు సమావేశంలో సంతాపం ప్రకటించారు.