చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల ప్రారంభం- గుంటూరు, అనంతపూర్లో-రేపు తెలంగాణలో
తెలుగు రాష్ట్రాల్లో కరోనా బారిన పడిన వారి కోసం ఆక్సిజన్ బ్యాంకుల్ని అందుబాటులోకి తెస్తానన్న మెగాస్టార్ చిరంజీవి మాట నిలబెట్టుకున్నారు. మొట్టమొదటిగా ఏపీలోని అనంతపురం, గుంటూరులో ఆక్సిజన్ బ్యాంకుల్ని నేటి నుంచి అందుబాటులోకి తెచ్చారు. రేపటి నుంచి తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్తో పాటు మరో ఐదు జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి తెస్తామని చిరంజీవి ప్రకటించారు.
ఈ రోజు ఉదయం 10.30 నుంచి అనంతపూర్,గుంటూరు జిల్లా కేంద్రాలలో #ChiranjeeviOxygenBanks సేవలు వినియోగించుకోవచ్చు.రేపటిలోగా ఖమ్మం, కరీంనగర్ తో పాటు ఇంకో 5 జిల్లాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. సమయానికి ఆక్సిజన్ దొరక్క ఇక ఎవరు ఇబ్బందిపడకూడదు.@KChiruTweets pic.twitter.com/IVnvIYjMiq
— ChiranjeeviCharitableTrust (@Chiranjeevi_CT) May 26, 2021
తెలుగు రాష్ట్రాల్లో కరోనా రోగుల కోసం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఆక్సిజన్ బ్యాంకుల్ని అందుబాటులోకి తెస్తానని ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి అనుకున్నట్లుగానే ఇవాళ ఏపీలోని అనంతపురం, గుంటూరులో వీటిని ప్రారంభించారు. చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ బ్యాంకులు ప్రారంభమయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ దశల వారీగా ఆక్సిజన్ బ్యాంకులు ప్రారంభం కానున్నాయి. ప్రకటించిన వారంరోజుల వ్యవధిలోనే భారీ ఎత్తున ఆక్సిజన్ సిలెండర్లను సమకూర్చుకుని బ్యాంకులు ప్రారంభించడం సంతోషంగా ఉందని చిరు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకుల్ని ఏర్పాటు చేసిన చిరంజీవి.. వీటి కోసం ప్రత్యేకంగా ఓ ట్విట్టర్ అకౌంట్నుకూడా అందుబాటులోకి తెస్తున్నారు. ఆక్సిజన్ కావాల్సిన వారు ట్విట్టర్ ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు చెబుతోంది. ఆక్సిజన్ దొరక్క ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వీటిని ప్రారంభిస్తున్నట్లు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు ట్విట్టర్ అకౌంట్లో చిరంజీవి ప్రకటించారు.