పవన్ అభిమానుల మృతి కలిచివేసిందన్న చిరంజీవి .. రామ్ చరణ్ తీవ్ర దిగ్భ్రాంతి
నేడు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు . పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు జనసేన పార్టీ నాయకులలోనూ, పవన్ అభిమానుల్లోనూ విషాదం నెలకొంది. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కనమలదొడ్డిలో జరిగిన ఈ ఘటనలో మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది.

పవన్ అభిమానుల మృతిపై చిరంజీవి ఆవేదన
కుప్పం పలమనేరు రహదారి పక్కన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని 30 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేయడానికి పైకెక్కి పని చేస్తున్న వారికి విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కు గురై పవన్ అభిమానులు మృతి చెందిన ఘటనపై చంద్రబాబు సొంత నియోజకవర్గం కాబట్టి ఆయన వెంటనే స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.పవన్ పుట్టిన రోజు నాడు నెలకొన్న విషాదంతో ఈ ఘటనపై స్పందించిన చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు .

మీ కుటుంబాలకు మీరే సర్వస్వం .. చిరంజీవి ట్వీట్
పవన్ పుట్టినరోజు సందర్భంగా చిత్తూరులో బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించడం నా గుండెను కలిచివేసింది అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ఆయన పేర్కొన్నారు . అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు కానీ మీ ప్రాణాలు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆయన అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీ కుటుంబానికి మీరే సర్వస్వం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ దుర్ఘటన తన మనసు తీవ్ర వేదన కలిగించిందని పేర్కొన్నారు.

రామ్ చరణ్ ట్వీట్ .. మీ ఆరోగ్యం, మీ ప్రాణం కంటే ఏది విలువైనది కాదు
మరోపక్క పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ముగ్గురు అభిమానులు మృతి చెందడంపై రామ్ చరణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుప్పంలో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు యువకులు మరణించారనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. మీ ఆరోగ్యం మీ ప్రాణం కంటే ఏది విలువైనది కాదు .మీరు ఎల్లప్పుడూ ఇది గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి అని నా మనవి అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

పుట్టిన రోజున విషాదంలో జనసేనాని పవన్ కళ్యాణ్
జనసైనికుల మరణం మాటలకందని విషాదం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదనతో ఉన్నారు. విద్యుత్ షాక్ తో మృతి చెందిన అభిమానులకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తీవ్ర గాయాలపాలైన చికిత్సపొందుతున్న వారికి తగిన వైద్య సహాయం అందేలా చూడాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.












Click it and Unblock the Notifications