నిజమే!: ఒప్పుకున్న చిరంజీవి, ఛాలెంజ్గా తీసుకున్నా
విజయవాడ: తమలో న్యూనతాభావం ఉందనే వాస్తవమేనని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటి చీఫ్ చిరంజీవి సోమవారం చెప్పారు. అయినా, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం కాంగ్రెసు పార్టీకి కొత్త కాదన్నారు. తన పైన కాంగ్రెసు పార్టీ అధిష్టానం పెట్టిన బాధ్యతను సవాల్గా తీసుకున్నానని చెప్పారు. ఎన్నికల ప్రచార బాధ్యతలను తాను ఛాలెంజ్గా తీసుకుంటున్నట్లు చెప్పారు.
కార్యకర్తలు తమలో నూతన ఉత్సాహం నింపారని చెప్పారు. రాష్ట్రం విడిపోవడంతోనే పోలవరం వచ్చిందని, కలిసి ఉంటే రాకపోయేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెసు పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమన్నారు. పాత నీరు పోవడం వల్ల కాంగ్రెసు పార్టీలోకి కొత్త నీరు వస్తోందన్నారు. కష్టపడితేనే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. బస్సు యాత్రను నిరాశతో ప్రారంభించామని అయితే, కార్యకర్తలు తమలో ఉత్సాహం నింపారని తెలిపారు.

విభజనతో మంచి ఫలితాలు వస్తాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వైఖరి పాత సామాన్లు కొనే వాడిలా ఉందన్నారు. సైకిల్ను చూసి ఆయన బుల్ డోజర్ అనుకుంటున్నారని చిరంజీవి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్న వారంతా అసమర్థులు, వయసు పైబడిన వారే అంటూ విమర్శించారు.
విభజన బాధాకరమే: రఘువీరా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బాధాకరమని ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా రెడ్డి చెప్పారు. ఎపిని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే శక్తి కాంగ్రెసుకే ఉందన్నారు. సాగు, తాగునీటి సమస్యలు తీరుస్తామన్నారు. అందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
సీమాంధ్రలోని 13 జిల్లాలో అభివృద్ధి చెందాలన్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తూ కాలాయాపన చేయడం సరికాదన్నారు. కాంగ్రెసు పార్టీ సర్వాంతర్యామి అన్నారు. కాంగ్రెసు ఉంటేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుందన్నారు. వారు విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications