పవన్ కు ప్రధాని - "అన్నయ్య" మద్దతు : చంద్రబాబుతో బంధం - అదే ఒప్పందం..!!
జనసేనాని పవన్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. విశాఖలో పవన్ పర్యటన సమయం నుంచి ఇప్పటి వరకు ఏపీ రాజకీయాల్లో పవన్ పాత్ర పెరిగింది. స్వయంగా చంద్రబాబు జనసేనాని వద్దకు వెళ్లటంత..పొత్తు అంశం ద్వారా మరింత కీలకంగా పవన్ రోల్ మారింది. అదే విశాఖలో ప్రధాని తో పవన్ కల్యాణ్ భేటీ ఏపీ రాజకీయాల్లో మరో ట్విస్ట్ కు కారణమైంది. ఆ సమావేశం తరువాత రాకీయంగా ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. కానీ, ఇక్కటి మాత్రం స్పష్టం అవుతోంది. అదే టీడీపీ - జనసేన బంధం పైన దాదాపు క్లారిటీ వచ్చేసింది.

అటు ప్రధాని మోదీ - ఇటు చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా ఓడించాలనేది జనసేనాని లక్ష్యం. ఇందు కోసం అందరినీ కలుపుకుపోతామని చెప్పుకొచ్చారు. టీడీపీ - జనసేన పొత్తు ఖాయమనే సంకేతాలు ఇచ్చారు. కానీ, విశాఖలో ప్రధాని పర్యటన తరువాత పవన్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. టీడీపీతో కలిస్తే పవన్ కు రాజకీయంగా భవిష్యత్ ఉండదని.. బీజేపీ - జనసేన కూమటిలో పవన్ దే కీలక పాత్ర ఉంటుందని ఆ భేటీలో విస్పష్ట సంకేతాలు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో పవన్ ఒక వేళ టీడీపీతో కలిసినా.. బీజేపీ మాత్రం తెలుగుదేశంతో కలిసేది లేదంటూ స్పష్టత వచ్చేసిందని తెలుస్తోంది. దీంతో, ఆ భేటీ తరువాత ప్రధానితో నిలవలా.. చంద్రబాబు వైపు మొగ్గాలా అనే సంశయంలో పవన్ ఉన్నారు.

2024 కాదు 2029 మన లక్ష్యం అంటూ
బీజేపీతో వెళ్లటం..టీడీపీ విడిగా పోటీ చేయటం ద్వారా వైసీపీకి రాజకీయంగా మేలు జరుగుతుందనేది ఒక అంచనా. అదే సమయంలో టీడీపీతో వెళ్తే..ప్రధానితో సంబంధాలు దెబ్బ తినటమే కాకుండా, తిరిగి వైసీపీ అధికారంలోకి వచ్చినా..టీడీపీకి సహకరిస్తూనే ఉండాల్సి ఉంటుందనేది మరో అభిప్రాయం. దీంతో..పవన్ తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇక, అనూహ్యంగా అన్నయ్య మెగాస్టార్ నుంచి పవన్ కు భారీ మద్దతు లభిస్తోంది. పవన్ ఖచ్చితంగా ఉన్నత స్థానంలో ఉంటారని చిరంజీవి చెప్పటం..ఈ పరిణాలన్నింటి కంటే పవన్ కు ఎక్కువ బూస్టప్ ఇచ్చేది. అయితే, అన్నయ్య కోరిక తీరాలంటే టీడీపీతో పొత్తుతో సాధ్యం కాదు. టీడీపీతో పొత్తుతో వెళ్లి.. అధికారంలోకి వచ్చినా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారనేది బీజేపీ నేతల వాదన. అయితే, బీజేపీ ముఖ్య నేతల నుంచి వస్తున్న సందేశం మేరకు ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకపోయినా.. 2029 ఎన్నికల్లో బీజేపీ - జనసేన కూటమిదే అధికారమని పవన్ కు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

పవన్ తుది నిర్ణయం పై ఉత్కంఠ
2024 ఎన్నికల్లో గెలిపిస్తే సరే..లేకుంటే ఇవే తనకు చివరి ఎన్నికలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పొత్తు పైన ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు. టీడీపీ ప్రభావం తగ్గితే ఆ స్థానంలో బీజేపీదే అనేది కమలం పార్టీ నేతల అంచనా. ఇప్పుడు ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా నిలవాలని భావిస్తే..ఇక బీజేపీతో ముఖ్యంగా ప్రధానితో సంబంధాల పైన ప్రభావం చూపుతాయని కమలం నేతలు విశ్లేషిస్తున్నారు. ఇక, ఇప్పుడు అన్నయ్య చిరంజీవి సూచనలు కూడా పవన్ కు కీలకంగా మారనున్నాయి. కానీ, పవన్ ఏ నిర్ణయం తీసుకున్న చిరంజీవి మద్దతు ఉంటుందని.. రాజకీయంగా సలహాలు మాత్రం చిరంజీవి ఇచ్చే అవకాశం ఉండదనేది విశ్లేషకుల అభిప్రాయం. దీంతో, ఇప్పుడు పవన్ కల్యాణ్ పొత్తుల పై తీసుకొనే నిర్ణయం టీడీపీకే కాదు.. వైసీపీకి కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications