లొంగుబాటు.. అనురాధ కేసులో ట్విస్ట్, హత్య జరిగిందిలా!: సికె బాబుతో వైరం!!
చిత్తూరు: ఏపీలోని చిత్తూరు నగర మేయర్ అనురాధ హత్య కేసులో ఇద్దరు నిందితులు చిత్తూరు నగర ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో ముగ్గురు నుంచి ఆరుగురు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. వీరు ముసుగు ధరించి వచ్చి దాడి చేశారు. ఆ తర్వాత గేట్ దూకి పారిపోయారు.
ఈ ఘటనలో చిత్తూరు మేయర్ అనురాధ మృతి చెందారు. ఆమెను పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. ఆమె భర్త మోహన్ను కత్తులతో పొడిచారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు అక్కడే పడి ఉన్న తుపాకీనీ స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల కోసం గాలింపు
ఇద్దరు నిందితులు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. మిగతా నిందితుల కోసం పోలీసులు చిత్తూరు వ్యాప్తంగా గాలిస్తున్నారు. నిందితులు కర్నాటకకు చెందిన కిరాయి గ్యాంగా లేక కర్నాటక రిజిస్ట్రేషన్ వాహనంలో వచ్చిన చిత్తూరువారా తెలియాల్సి ఉంది. హత్య జరగగానే లొంగుపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
హుటాహుటిన చిత్తూరుకు బొజ్జల, చినరాజప్ప
అనురాధ హత్య నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, టిడిపి సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి హుటాహుటిన చిత్తూరుకు బయలుదేరారు. కాగా, తమ పార్టీ నేత, చిత్తూరు మేయర్ అనురాధ హత్యపై టిడిపి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు స్పందించారు.
కఠారి దంపతులపై ఎవరు దాడి చేశారో తెలియాల్సి ఉందన్నారు. కర్ణాటకకు చెందిన వ్యక్తులు కఠారి దంపతులపై దాడి చేయాల్సిన అవసరమేమీ లేదని అభిప్రాయపడ్డారు. టీడీపీలో కష్టపడేతత్వమున్న కార్యకర్తగా అనురాధ పేరు తెచ్చుకున్నారని, ఆమె మృతి పార్టీకి తీరని లోటన్నారు.
అనురాధ హత్య ఎలా జరిగిందంటే...?
చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్లపై పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగింది. కార్పొరేషన్లో నిర్వహించే గ్రీవెన్స్ డే సందర్భంగా మేయర్కు పలువురు ఫిర్యాదులు, విజ్ఞాపన పత్రాలు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే నిందితులు మేయర్కు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని వచ్చారు.
వీరిలో ఇద్దరు బురఖాలు ధరించారు. మిగిలిన వారు మామూలుగానే కార్యాలయంలోకి వచ్చారు. మేయర్ ఛాంబర్లోకి రాగానే వెంటనే తుపాకితో కాల్పులు జరిపారు. మోహన్ పైన కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో అనురాధ అక్కడికక్కడే దుర్మరణం పాలవగా, మోహన్ తీవ్రంగా గాయపడ్డారు.
తుపాకుల శబ్దం వినిపించగానే, కార్యాలయంలో ఉన్న ప్రజలు, సిబ్బంది షాక్కు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కనిపించింది. అదే సమయంలో దాడి చేసిన దుండగులు పారిపోయారు. ఈ దాడికి సంబంధించి అంతకుముందే పక్కాగా రెక్కీ నిర్వహించి ఉంటారని భావిస్తున్నారు.
అనురాధ, సికె బాబుల మధ్య వైరం
కటారీ మోహన్ కుటుంబానికి, సికె బాబుకు మధ్య ఎన్నో ఏళ్లుగా వైరం ఉంది. గతంలో కూడా మోహన్ పైన హత్యాయత్నం జరిగిందిత. ఈ ఘటనలో మోహన్ తీవ్రంగా గాయపడి, తృటిలో తప్పించుకున్నాడు. ఈ రెండు కుటుంబాలకు చెందిన వారిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి.
అయితే ఇటీవలే మోహన్ పైన జరిగిన హత్యాయత్నం కేసులో సికె బాబును నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు ప్రకటించింది. సికె బాబు పైన జరిగిన దాడి కేసులో మోహన్ నిందితుడిగా ఉన్నారు. ఎన్నికల తర్వాత సికె బాబు రాజకీయాల్లో పెద్దగా కనిపించలేదు.
సికె బాబు పాత్ర పైన కూడా పోలీసులు విచారిస్తున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా, మోహన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చింటూను కూడా పోలీసులు విచారిస్తున్నారని సమాచారం. అనురాధ హత్యతో చిత్తూరులో ఉద్రిక్తత నెలకొంది.