సిబిల్ స్కోరు పాడైతే జైలుకు వెళ్తారా? చట్టం ఏం చెబుతుందో క్లియర్గా తెలుసుకోండి!
ఉద్యోగం పోవడం, వ్యాపారంలో నష్టాలు లేదా హఠాత్తుగా వచ్చే ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది సమయానికి బ్యాంక్ ఈఎంఐలు లేదా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించలేకపోతుంటారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ప్రతి ఒక్కరినీ వెంటాడే అతిపెద్ద భయం.. సిబిల్ స్కోరు పాడైపోతుందేమోనని ఆందోళన పడుతుంటారు. మరికొందరిలో రుణాలు చెల్లించకపోతే పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? అనే సందిగ్ధత కూడా ఉంటుంది. ఈ క్రమంలో సిబిల్ స్కోరు తగ్గితే నిజంగానే జైలు శిక్ష పడుతుందా? అనే ప్రశ్నలకు చట్టం ప్రకారం సమాధానాలు తెలుసుకోవడం చాలా అవసరం.
ముందుగా సిబిల్ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. ఇది ఓ వ్యక్తి ఆర్థిక నివేదిక వంటింది. మనం తీసుకున్న అప్పులు, క్రెడిట్ కార్డు బిల్లులను సమయానికి కడుతున్నామా లేదా అనే ట్రాక్ రికార్డును ఇది చూపిస్తుంది. సాధారణంగా సిబిల్ స్కోరు 300 నుంచి 900 పాయింట్ల మధ్య ఉంటుంది. ఇందులో 750 కంటే ఎక్కువ ఉంటే మంచి స్కోరు అని.. 600 కంటే తక్కువగా ఉంటే చెడు స్కోరు అని భావిస్తారు. ఎవరైనా వరుసగా ఈఎంఐలు ఎగ్గొడితే ఈ స్కోరు వేగంగా పడిపోతుంది.

చట్టం ప్రకారం.. కేవలం సిబిల్ స్కోరు పాడైనంత మాత్రాన జైలుకు వెళ్లాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఎందుకంటే సిబిల్ అనేది మీ ఆర్థిక లావాదేవీల చరిత్రను మాత్రమే చూపిస్తుంది తప్పి అది ఓ నేరం కాదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పు తీర్చలేకపోతే పోలీసులు మిమ్మల్సి అరెస్ట్ చేయలేరు. అయితే సిబిల్ స్కోరు తగ్గడం వల్ల జైలు శిక్ష పడకపోయినా భవిష్యత్తులో చాలా నష్టాలు ఉంటాయి. కొత్తగా రుణాలు పొందాలంటే చాలా కష్టమవుతుంది. హోమ్ లోన్లపై ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది. అలాగే కొన్ని పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు కూడా అభ్యర్థి సిబిల్ స్కోరును తనిఖీ చేసి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది.
అయితే కేవలం సిబిల్ స్కోరు పాడైతే జైలు శిక్ష ఉండదు కానీ ఉద్దేశపూర్వకంగా బ్యాంకులను మోసం చేస్తే మాత్రం తీవ్రమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి. భారతీయ న్యాయ సంహిత (BNS 2023) ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బ్యాంకింగ్ మోసాలకు పాల్పడితే కఠిన శిక్షలు విధిస్తారు.
BNS 2023 సెక్షన్ 318: తప్పుడు పత్రాలు, నకిలీ వివరాలు సృష్టించి బ్యాంకులను మోసం చేసి లోన్లు పొందితే ఈ సెక్షన్ కింద గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.
BNS 2023 సెక్షన్ 316: దీనిని 'క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్' (నమ్మకద్రోహం) అంటారు. ప్రజల సొమ్మును లేదా బ్యాంకుకు చెందిన ఆస్తులను దళారులు, ఏజెంట్లు లేదా ఉద్యోగులు అక్రమంగా మళ్లించినా లేదా దుర్వినియోగం చేసినా ఈ చట్టం వర్తిస్తుంది.
సిబిల్ స్కోరును మెరుగుపరచుకోవాలంటే?
ఒకవేళ మీ సిబిల్ స్కోరు ఇప్పటికే పడిపోయి ఉంటే ఆందోళన పడకుండా కొన్ని ఆర్థిక జాగ్రత్తలతో దానిని మళ్లీ మెరుగుపరుచుకోవచ్చు. దీని కోసం ప్రతి నెలా ఈఎంఐలను, క్రెడిట్ కార్డ్ బిల్లులను గడువులోగా చెల్లించే అలవాటు చేసుకోవాలి. పాత బాకీలను పూర్తిగా తీర్చివేయాలి. ఒకవేళ మీరు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంటే భయపడి పారిపోకుండా నేరుగా బ్యాంకు అధికారులతో మాట్లాడటం ఉత్తమం. మీ పరిస్థితిని బట్టి బ్యాంకులు మీ లోన్ వడ్డీని కాస్త తగ్గించడం లేదా ఈఎంఐల చెల్లింపు గడువును మార్చడం వంటి వెసులుబాట్లను కల్పిస్తాయి. భయపడటం కంటే చట్టాలపై సరైన అవగాహన కలిగి ఉండటమే ఇక్కడ ముఖ్యం.












Click it and Unblock the Notifications