రోజుకు 10 గంటలు బంకులు బంద్.. పెట్రోల్, డీజిల్పై కఠిన ఆంక్షలు!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర కలకలం రేపుతోంది. ఇంధన సంక్షోభం, వ్యవసాయ పనుల డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతల సమస్యలు రాకుండా ఉండేందుకు అక్కడి జిల్లా యంత్రాంగాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. యూపీలోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో పెట్రోల్ బంకులను రోజుకు కేవలం 14 గంటలు మాత్రమే నడపాలని, మిగిలిన 10 గంటలు పూర్తిగా మూసివేయాలని అధికారులు ఆదేశించారు. దీనితో పాటు వాహనదారులకు ఇచ్చే ఇంధన పరిమాణంపై పరిమితులు విధిస్తూ రేషనింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు.
కారుకు 20 లీటర్లు.. బైక్కు 3 లీటర్లే పెట్రోల్!
సంత్ కబీర్ నగర్ జిల్లా సరఫరా అధికారి(డీఎస్వో) రాజీవ్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. జిల్లాలోని పెట్రోల్ బంకులు ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. వాహనాల రకాన్ని బట్టి ఇంధన విక్రయాలపై కింది విధంగా ఆంక్షలు విధించారు. బైక్ / స్కూటీలకు గరిష్టంగా కేవలం 3 లీటర్ల పెట్రోల్ మాత్రమే పోస్తారు. కారు / జీపు (లైట్ వెహికల్స్)లకు గరిష్టంగా 15 నుండి 20 లీటర్ల వరకు మాత్రమే పెట్రోల్ లేదా డీజిల్ ఇస్తారు. ట్రక్కులు / బస్సుల (భారీ వాహనాలు)కు 30 నుంచి 40 లీటర్ల వరకు మాత్రమే ఇంధనం పరిమితం చేశారు. ట్రాక్టర్లకు వ్యవసాయ పనుల కోసం వీటికి గరిష్టంగా 30 లీటర్ల వరకు డీజిల్ విక్రయిస్తారు.

డబ్బాల్లో పెట్రోల్ పోస్తే కుదరదు!
చమురు సంక్షోభం కారణంగా అధికారులు బ్లాక్ మార్కెటింగ్కు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ వాహనదారునికైనా సరే, కారు లేదా బైక్ ట్యాంకుల్లో నేరుగా పోయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని.. ఎలాంటి గాలన్లు, డబ్బాలు లేదా జెరికెన్లలో పెట్రోల్ పోయకూడదని స్పష్టం చేశారు. అయితే రైతుల అవసరాల కోసం కేవలం డీజిల్ను మాత్రమే డబ్బాల్లో కొనుగోలు చేసేందుకు అనుమతించారు. అది కూడా గరిష్టంగా 15 లీటర్లు మాత్రమే ఇస్తారు. రైతులు తమ 'ఫార్మర్ రిజిస్ట్రీ' లేదా 'రైతు పాస్ బుక్ చూపించి గుర్తింపు నిరూపించుకుంటేనే బంకుల్లో డీజిల్ అందిస్తారు.
మహారాజ్ గంజ్ జిల్లాలో మరింత కఠినం.. 11 రోజులు బంద్!
సంత్ కబీర్ నగర్తో పాటు పొరుగున ఉన్న మహారాజ్గంజ్ జిల్లాలో కూడా ఇంధన ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అక్కడ బంకులను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే (రోజుకు 13 గంటలు) తెరిచి ఉంచాలని, మిగిలిన 11 గంటలు మూసివేయాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ సింగ్ సోగర్వాల్ ఆదేశించారు. ఈ జిల్లాలో డబ్బాల్లో తీసుకునే డీజిల్ పరిమితిని కేవలం 5 లీటర్లకే పరిమితం చేశారు. అంతేకాకుండా, నంబర్ ప్లేట్ లేని వాహనాలకు అస్సలు పెట్రోల్ లేదా డీజిల్ పోయకూడదని బంక్ యజమానులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరలకు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications