పోలవరం కడుతామని చెప్పలేదు: చంద్రబాబు యూ టర్న్
అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారు. అసలు తాము పోలవరం నిర్మిస్తామని చెప్పలేదని, జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే కట్టాలని ఆయన అన్నారు.
అయితే ఢిల్లీ నుంచి పనుల నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రధానమైంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమైతేనే ప్రత్యేక శ్రద్ధతో నిర్మించగలదని నీతి ఆయోగ్ సూచించిందని, ఆ సూచనను కేంద్రం ఆమోదించి కాబట్టే పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నామని చెప్పారు.
కేంద్రం అప్పుడు దిగి వచ్చి...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తలకెత్తుకున్న తర్వాత కూడా తాను గట్టి పట్టుపట్టానని, తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపేదాకా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోనని తెగేసి చెప్పానని, దాంతో కేంద్రం అప్పటికప్పుడు పార్లమెంటులో బిల్లు పెట్టి ఎప్కిి ఇచ్చిందని చంద్రబాబు అన్నారు.
పోలవరాన్న పూర్తి చేసి తీరుతా..
ఎట్టి పరిస్థితిలోనూ 2019లోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పారు ఈ విషయంలో అందరికీ స్పష్టత ఉండాలని ఆయన అన్నారు. మంగళవారం శాసనసభా పక్ష సమావేశానికి ముందే చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఆ భూముల ద్వారా వనరులను పెంచుకోవచ్చు..
ఒక్క పైసా తీసుకోకుండా ప్రజలు భూములు ఇచ్చారని, ఇప్పుడు భూములకు సంబంధించి ఏ విధమైన వివాదాలు లేవని, ప్రభుత్వ అవసరాలకు, రైతులకు హామీ ఇచ్చినట్లు ప్లాట్లు, ఇతరత్రా భూములు పోగా, ఇంకా కొంత మిగులుతుందని చంద్రబాబు చెప్పారు. మిగిలిన భూమిని మార్కెట్ చేసుకోగలిగితే లాభాలు వస్తాయని, తద్వారా వనరులను పెంచుకోవచ్చునని అన్నారు.
ఢిల్లీ నుంచి అలా అంటున్నారు, కానీ..
ఎపికి ప్రత్యేక హోదా కోసం ఓ వైపు పోరాడుతూనే మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇవి తనకు రెండు కళ్లని అన్నారు. ఢిల్లీ నుంచి పోరాటం చేయాలని కొందరు సూచిస్తున్నారని ఆయన అన్నరు. ముందుకు విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని, రాష్ట్రానికి అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకోకుండా అదే సమయంలో ప్రజల మనోభావాలను కాపాడుకుంటూ వారిని సంసిద్దులను చేస్త శాంతిభద్రతలు కాపాడుతూ అభివృద్ధి మార్గంలో పయనించాలని అన్నారు.