నోటీసు లేదూ, వారెంటూ లేదూ, బలవంతంగా లాక్కెళ్లారు : రఘురామ కుమారుడు భరత్
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఏపీ సీఐడీ అధికారులు ఇవాళ హైదరాబాద్లోని తన నివాసంలో అరెస్టు చేసి తీసుకెళ్లడంపై ఆయన కుమారుడు భరత్ స్పందించారు. అరెస్టు సందర్బంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఐడీ పోలీసుల వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
తన తండ్రి రఘురామకృష్ణంరాజును పోలీసులు అకారణంగా అరెస్టు చేశారని ఆయన తనయుడు భరత్ ఆరోపించారు. మధ్యాహ్నం మూడున్నరకి 30 మంది పోలీసులు హైదరాబాద్లోని తమ నివాసానికి వచ్చారని, వారెంట్ కూడా లేకుండా వచ్చి బలవంతంగా లాక్కొని వెళ్లిపోయారని భరత్ ఆరోపించారు. సీఆర్పీఎఫ్ భద్రతతో ఉన్న ఎంపీని సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విధానంపై ఆయన నిప్పులు చెరిగారు.
నాలుగు నెలల క్రితం తన తండ్రి రఘురామకృష్ణంరాజుకు బైపాస్ సర్జరీ జరిగిందని తనయుడు భరత్ తెలిపారు. కానీ ఇవాళ 30 మంది పోలీసులు వారెంట్, నోటీస్ లేకుండా ఇంట్లోకి చొరబడి సీఆర్పీఎఫ్ సిబ్బందిని నెట్టేసి తన తండ్రిని తీసుకెళ్లిపోయారని ఆయన ఆరోపించారు. ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తమకు తెలియదన్నారు. ఆయన ప్రాణానికి ఎలాంటి హాని జరిగినా సీఐడీ పోలీసులదే బాధ్యతన్నారు. ఆయనపై ఏ కేసులు పెట్టారో కూడా తమకు చెప్పలేదని భరత్ తెలిపారు.
నోటీసు లేదూ, వారెంటూ లేదూ, బలవంతంగా లాక్కెళ్లారు : రఘురామ కుమారుడు భరత్#RaghuramakrishnamRaju pic.twitter.com/Z9sIh8fG7O
— oneindiatelugu (@oneindiatelugu) May 14, 2021