చంద్రబాబు సహకరిస్తారా - సీఐడీ తాజా ప్లాన్ , ప్రశ్నల సంగ్రామం..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandra Babu) విచారణకు సీఐడీ సిద్దమైంది. రెండు రోజులపాటు సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు(ACB Court) తీర్పునిచ్చింది. ఈ రోజు, రేపు రాజమండ్రి జైలులోనే సీఐడీ అధికారులు చంద్రబాబును విచారించనున్నారు. ఇందు కోసం కొత్త వ్యూహాలతో సీఐడీ(CID) సిద్దమైంది. దాదాపు 30 ప్రశ్నలకు సమాధానం రాబట్టటమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సహకరిస్తారా..ఏం జరుగుతందనేది ఉత్కంఠ పెంచుతోంది.
ఏసీబీ కోర్టు అనుమతి : చంద్రబాబును రెండు రోజులు పాటు కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. చంద్రబాబునాయుడును (Chandrababu) విచారించేందుకు సీఐడీ (CID) తరపున 12 మందికి అనుమతి ఇస్తున్నట్లు ఏసీబీ కోర్టు (ACB court) తెలిపింది.

తొమ్మిది మంది విచారణ అధికారులు, ఇద్దరు మధ్యవర్తులు, ఒక వీడియో గ్రాఫర్ ఉంటారని పేర్కొంది. చంద్రబాబు తరపున ఇద్దరు న్యాయవాదులు గింజుపల్లి సుబ్బారావు, దొమ్మాలపాటి శ్రీనివాస్ పాల్గొనడానికి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో, రెండు రోజుల విచారణ ఈ రోజు ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రశ్నాపత్రంతో సీఐడీ అధికారులు రాజమండ్రికి చేరుకున్నారు.
ప్రశ్నలతో సీఐడీ టీం : నంద్యాలలో అరెస్ట్ చేసి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చిన సమయంలో చంద్రబాబును విచారించారు. ఆ సమయంలో చంద్రబాబు తమకు సహకరించలేదనేది సీఐడీ అధికారుల వాదన. దీంతో, ఇప్పుడు కొత్త వ్యూహంతో ప్రశ్నలు సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 అంశాలకు సంబంధించి సీఐడీ(CID) బృందం ప్రశ్నించనుంది.
ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో బాబుపై 34 అభియోగాలు మోపిన సీఐడీ(CID) తప్పుడు పత్రాలు సృష్టించటం, నిధులు మళ్లింపు, సిమన్స్ ఒప్పందం, జారీ చేసిన జీవోతో పాటుగా, డాక్యుమెంట్స్, ఫోర్జరీ, 13 నోట్ ఫైల్స్పై బాబు సంతకాలు, ఐటీని లెక్కచెయ్యకపోవటం, షెల్ కంపెనీలు, అధికారులపై ఒత్తిడి లాంటి కీలక అంశాలపై ప్రశ్నలు సంధించనున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు సహకరిస్తారా : స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్(Cabinet) అప్రూవల్ లేకపోవడంపై సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. నిధుల విడుదలపై ఫైనాన్స్ శాఖ అధికారులు వద్దన్నా చంద్రబాబు ఎందుకు వందల కోట్లు విడుదల చేయించారనే విషయంపై సీఐడీ(CID) ప్రశ్నలు సిద్ధం చేసిందని సమాచారం.
ఇదే సమయంలో చంద్రబాబు విచారణకు సహకరిస్తారా లేదా అనేది మరో చర్చగా మారింది. అటు బెయిల్ పిటీషన్ కోర్టులో పెండింగ్ లో ఉంది. సోమవారం బెయిల్ పిటీషన్ పైన ఏసీబీ కోర్టు(ACB Court) విచారించనుంది. అటు సీఐడీ పీటీ వారెంట్లు దాఖలు చేసిన కేసుల్లో హైకోర్టులో బెయిల్ పిటీషన్లు దాఖలయ్యాయి. దీంతో, సీఐడీ విచారణలో చంద్రబాబు వెల్లడించే అంశాలు మొత్తంగా కీలకం కానున్నాయి. విచారణ తర్వాత రిపోర్టును సీల్డ్ కవర్లో ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు అందించనున్నారు.












Click it and Unblock the Notifications