అక్కినేని ప్రేమనగర్ వల్లే స్థిరపడ్డా: రామానాయుడు
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఫిలిం ఛేంబర్లో జరిగిన ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వర రావు సంతాపసభ జరిగింది. ఈ సభలో పలువురు సినీ ప్రముఖులు తమకు అక్కినేనితో గల అనుబంధాన్ని నెమరేసుకన్నారు. తాను అక్కినేని నాగేశ్వర రావు హీరోగా నటించిన ప్రేమనగర్ చిత్రం ద్వారానే సినీరంగంలో స్థిరపడ్డానని ప్రముఖ సినీ నిర్మాత రామానాయుడు చెప్పారు. తనలాంటి ఎందరో నిర్మాతలకు అక్కినేని అండగా నిలిచారని ఆయన అన్నారు. అక్కినేని క్రమశిక్షణ గల వ్యక్తి అని ఆయన అన్నారు. అక్కినేనిని ఆయన నిర్మాతల నటుడిగా అభివర్ణించారు.
అక్కినేని జీవితం తెరిచిన పుస్తకమని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఎన్టీ రామారావుకు మాదిరిగానే అక్కినేనికి హైదరాబాదులో ఘాట్ నిర్మించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అక్కినేని అత్మకు శాంతి కలగాలని ఆయన అన్నారు. అక్కినేనితో తనకు గల అనుబంధాన్ని గిరిబాబు నెమరేసుకున్నారు. అక్కినేనిని ఆయన దేవుడిగా అభివర్ణించారు.
తాను సినీ పరిశ్రమలోకి దర్శకుడిగా రాలేదనీ అక్కినేని అభిమానిగా వచ్చానని ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. తన సంభాషణలను అక్కినేని తాను చెప్పడానికి అవకాశం ఇచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. అభిమానులను అక్కినేని తనతో సమానంగా చూసేవారని చెప్పారు.
తెలుగు ప్రజలు ఉన్నంత వరకు అక్కినేని అమరజీవి అని ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరి రావు అన్నారు. సంపాదనను అక్కినేని ఎక్కువగా సినీ పరిశ్రమ అభివృద్ధికే వెచ్చించారని, స్టూడియోల నిర్మాణానికి స్ఫూర్తి ప్రదాత అక్కినేని అని ఆయన అన్నారు. అక్కినేని వ్యక్తి కాదు, సంస్థ అని ఆయన అన్నారు. అక్కినేని విద్యను ప్రోత్సహించేవారని, అక్కినేనిలో ఎంతో సమయస్ఫూర్తి ఉండేదని చాట్ల శ్రీరాములు అన్నారు.
అక్కినేని సేవలు మరిచిపోలేనవని పరచూరి వెంకటేశ్వర రావు అన్నారు. దేవుడ్ని అంతగా నమ్మని అక్కినేని నాగేశ్వర రావును, దేవుడిని విశ్వసించిన ఎన్టీ రామారావును దేవుడు సమానంగా చూశారని, వారిద్దరు తెలుగు సినీ పరిశ్రమకు భీష్ముడిలాంటివారని ఆయన అన్నారు. అక్కినేనితో తనకు గల అనుబంధాన్ని విజయచందర్ నెమరేసుకన్నారు.