సినీ ప్రియులకు షాక్: ఏపీలో భారీగా పెరగనున్న టికెట్ల ధరలు?
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సినిమా టిక్కెట్ ధరల పెంపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ పెరుగుదల అమల్లోకి రానున్నట్లు సమాచారం.

నగరాల్లో ఇలా..
నగరాల్లోని సినిమా థియేటర్లలో రూ.75గా ఉన్న ఉన్నత శ్రేణి టిక్కెట్ ధరను రూ.100 వరకూ పెంచనున్నారు. పెంచిన ధరకు జీఎస్టీ అదనం. టిక్కెట్ ధర, పన్ను కలిపితే రూ.118 అవుతుంది.

18శాతం పన్నుతో..
చిత్ర పరిశ్రమ నుంచి ఆ శ్రేణి టిక్కెట్ను రూ.125 చేయాలనే విజ్ఞప్తి తొలుత వచ్చింది. ఆపై రూ.100కే పరిమితం కావాలని భావించింది. అయితే, జీఎస్టీ అమలులోకి వచ్చాక రూ.100పైన 18శాతం పన్ను వేయడం జరుగుతుంది.

వినోదపు పన్ను ఉండదు, కానీ..
రూ.100 దాటితే పన్ను 28శాతం అవుతుంది కాబట్టి ధర మరింత పెరుగుతుందని లెక్కించారు. ఈ క్రమంలో రూ.100కు పెంచమని కోరినట్లు తెలిసింది. దీనిపై రూ.18 జీఎస్టీ ఉంటుంది. వినోదపు పన్నుండదు.

సినీ ప్రియులకు భారమే..
మల్టీప్లెక్స్ల్లో రిక్లయినర్ సీట్లకు రూ.300, మిగిలిన వాటికి రూ.200గా టిక్కెట్ ధరలు ఉండనున్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఆర్థిక, హోం, రెవెన్యూ శాఖల అధికారులతో తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి ప్రతినిధులు సమావేశమయ్యారు. టిక్కెట్ ధరల పెంపుపై చర్చించారు. ఈ క్రమంలో త్వరలోనే టికెట్ల ధరల పెంపునకు సంబందించి ఉత్తర్వులు వెలువడనున్నాయి. దీంతో సినీ ప్రియులపై కొంత భారం తప్పదు.












Click it and Unblock the Notifications