జ్యుడిషియల్ అకాడమీ ప్రారంభించిన సీజేఐ చంద్రచూడ్-జడ్డీలకు కీలక సూచనలు..
గుంటూరు : ఏపీలో జ్యుడిషియల్ అకాడమీని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇవాళ ప్రారంభించారు. మంగళగిరిలోని కాజాలో ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ అకాడమీని హైకోర్టు న్యాయమూర్తుల్ని కలిసి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో విభజన తర్వాత ప్రభుత్వం తొలిసారి జ్యుడిషియల్ అకాడమీని ఏర్పాటు చేసింది. దీనికి సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ను ఆహ్వానించారు. దీంతో మంగళగిరికి చేరుకున్న సీజేఐ.. ఇవాళ జ్యుడిషియల్ అకాడమీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన సీజేఐ.. న్యాయవ్యవస్థలో చోటు చేసుకుంటున్న మార్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
న్యాయవ్యవస్ధలో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వాడకం దృష్ట్యా.. దాన్ని అందిపుచ్చుకునేందుకు వీలుగా డిజిటలైజేషన్ కు శ్రీకారం చుడుతున్నట్లు సీజేఐ చంద్రచూడ్ వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలని న్యాయమూర్తులు, న్యాయవాదులకు సీజేఐ సూచించారు. కేసుల సత్వర పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని కోరారు. న్యాయమూర్తులు కూడా నిత్య విద్యార్ధులుగా ఉంటూ నైపుణ్యాలు పెంచుకోవాలని ఆయన సూచించారు. న్యాయాన్ని నిలబెట్టేలా చూడాలన్నారు. కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలని న్యాయమూర్తులకు సీజేఐ సూచించారు.