భూమనపై సీజేఐ ఎన్వీరమణ వ్యాఖ్యలు : పదవులు దక్కలేదు - ఇబ్బందులున్నా నాతోనే ..!!
వైసీపీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి గురించి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ పర్యటనలో భాగంగా సీజేఐ ఎన్వీ రమణ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో జరిగిన మహాత్మ గాంధీ ఆత్మకథ - సత్యశోధన పుస్తకావిష్కరణ సభలో సీజేఐ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని ప్రశంసించారు. ఆయనకు కీలక పదవులు రాకపోవటం పైన ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

భూమనకు ఉన్నత స్థానం ఎందుకు లేదో
పార్టీలు కరుణాకర్ రెడ్డిని సరిగ్గా ఉపయోగించుకోవటం లేదనేది తన అభిప్రాయంగా చెప్పారు. ఎందుకు ఉన్నత స్థానంలో ఉంచటం లేదో తెలియటం లేదన్నారు. రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని తెలిసినా ఎప్పుడూ కరుణాకర రెడ్డి తనకు ఆత్మీయుడిగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. భూమన తనకు అపూర్వ సహోదరుడని వ్యాఖ్యానించారు. గాంధీ ఆత్మకధలో అన్నీ వాస్తవాలే ఉన్నాయని సీజేఐ ఎన్వీ రమణ చెప్పుకొచ్చారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గాంధీ ఆత్మకధ చదవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తిరుపతిని గాంధీజీ రెండు సార్లు సందర్శించటం గొప్ప విషయంగా సీజేఐ అభివర్ణించారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత గాంధీజీని మరిచిపోతున్నారని.. ఇటువంటి సమయంలో భూమన కరుణాకర రెడ్డి సత్య శోధన తిరిగి ముద్రించటాన్ని సీజేఐ అభినందించారు.

భూమనను సీజేఐ ఏం కోరారంటే
గాంధీ జీ మిగిలిన పుస్తకాలను ముద్రించాలని కోరారు. రాజకీయాల్లో భూమన నొర్మొహమాటంగా నెట్టుకు రావటం గొప్ప విషయంగా పేర్కొన్నారు. కరుణాకర రెడ్డి తనకు ఆత్మీయ సోదరుడిగా సీజేఐ చెప్పుకొచ్చారు. టీటీడీ ఛైర్మన్ గా కరుణాకర్ రెడ్డి తెలుగు మహా సభలు నిర్వహించారని గుర్తు చేసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ.. తిరుపతిలోనే తెలుగు భాష బ్రహ్యోత్సవాలు నిర్వహించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇదే సభలో మాట్లాడిన భూమన రాజకీయాల్లో మార్పు రాకుంటే సమాజం కు నష్టమని చెప్పారు. 2006 లో టిటిడి జేఈఓగా ఉన్న ధర్మారెడ్డి పట్ల చేసిన తప్పుకు క్షమాపణలు చెబుతున్నట్లుగా భూమన చెప్పారు.

సీఎంతో కలిసి విజయవాడలో...
విప్లవ రాజకీయాల నుంచి వచ్చిన తాను గతంలో గాంధీ సిద్దాంతాలను వ్యతిరేకించినందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు.గాంధీ సిద్ధాంతాలు స్వాతంత్ర సమరం సమయంలో కన్నా ప్రస్తుతం ఎంతో అవసరమని భూమన అభిప్రాయపడ్డారు. గాంధీ ఆదర్శ జీవితం అందరికీ అందించాలని సత్యశోధనను ముద్రించానని చెప్పిన భూమన.. ఆధ్యాత్మికతను నైతికత తో జయించి రాజకీయాలను నడిపిన గొప్ప వ్యక్తి గాంధీ అంటూ కొనియాడారు. సీజేఐ ఎన్వీ రమణ రేపు (శనివారం) విజయవాడలో పర్యటించనున్నారు. నూతనంగా నిర్మించిన కోర్టు భవనాలను సీఎం జగన్ తో కలిసి ప్రారంభిస్తారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సీజేఐ ఎన్వీ రమణకు రేపు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయనుంది.












Click it and Unblock the Notifications