సీజేఐ ఎన్వీరమణ - సీఎం జగన్ కలిసి : నాటి చొరతో - నేడు విజయవాడలో ఇలా..!!
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. సీఎం జగన్ కలిసి విజయవాడలో ఒక కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ నెల 27న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ ఎన్వీ రమణ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ రోజు సాయంత్రం హైదరాబాదు నుంచి బయల్దేరి ఆయన రాత్రి 7.20 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. రాత్రికి తిరుపతిలోనే బస చేస్తారు. 19వ తేదీ తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నేడు తిరుపతికి సీజేఐ ఎన్వీ రమణ
ప్రధానంగా మహాత్మాగాంధీ ఆత్మకథ సత్యశోధన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాదు బయల్దేరి వెళతారు .తిరుపతిలో మహాత్ముని ఆత్మకథ సత్యశోధన పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి నిర్వహించనున్నారు. ఈ నెల 20న సీజేఐ విజయవాడలో న్యాయస్థానాల ప్రాంగణంలో జీ ప్లస్ 7 నూతన న్యాయస్థానాల భవనాలను ప్రారంభించనున్నారు. ఈ భవనాల నిర్మాణం కోసం 2013లో అప్పటి ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ శంకుస్థాపన చేశారు.
సీజేఐ - సీఎం కలిసి కోర్టులు ప్రారంభం
ఇప్పుడు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఆయన వాటిని ప్రారంభిస్తున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత రెండు రోజుల పాటు ఆయన తన స్వగ్రామంతో పాటుగా విజయవాడ - అమరావతి లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే విజయవాడలో కొత్త కోర్టు నిర్మాణం గురించి ఆరా తీసారు. ఆ తరువాత వీటి నిర్మాణం వేగవంతం అయింది. సీజేఐగా ఉన్న కాలంలోనే ఆ భవనాలను ప్రారంభించాలని భావించారు. దీనికి తగినట్లుగానే ప్రభుత్వం వీటి నిర్మాణం పూర్తి చేసింది. సీజేఐ హోదాలో తొలి సారి విజయవాడకు వచ్చిన సమయంలో సీఎం జగన్ మర్యాద పూర్వకంగా కలవటం.. ప్రభుత్వం నుంచి ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేసారు.
వీడ్కోలు సమయంలో అన్నీ చెబుతా
రాజ్ భవన్ లో గవర్నర్ సీజేఐ గౌరవార్ఢం ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. తిరిగి.. ఇప్పుడు సీజేఐతో కలిసి విజయవాడ లో కోర్టు భవనాల ప్రారంభంలో పాల్గొంటున్నారు. అదే రోజు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సీజేఐ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయనుంది. ఇదే సమయంలో తాజాగా సీజేఐ హోదాలో జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేసారు. తాను చెప్పాల్సినవి చాలా ఉన్నాయని.. పదవీ విరమణ రోజున అవన్నీ చెబుతానని వ్యాఖ్యానించారు. పదవీ విరమణకు ముందు ఎటువంటి వ్యాఖ్యలు చేయదలచుకోలోదని చెప్పారు. దీంతో..ఇప్పుడు సీజేఐ ఎన్వీ రమణ ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.