క్లాస్లో కొట్టుకున్న గురుశిష్యులు, తెరాస నేతకు క్లాస్
హైదరాబాద్: ఉపాధ్యాయుడు, విద్యార్థి.. ఇద్దరు తరగతిగదిలోనే పరస్పరం దాడులకు దిగి, పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇద్దరి పైన పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. ఈ సంఘటన ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని లెజెండ్ కళాశాలలో జరిగింది.
ఎస్సార్ నగర్లోని సదరు కళాశాల కామర్స్ లెక్చరర్ ఆడం, ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థి అనీల్ల మధ్య తలెత్తిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ప్రతిరోజు సమయానికే కళాశాలకు వచ్చినా హాజరు వేయకుండా సెలవుగా రిజిస్టర్లో నమోదు చేస్తున్నందున కామర్స్ లెక్చరర్ ఆడంతో విద్యార్థి అనీల్ వాగ్వాదానిగి దిగాడట.
దీంతో లెక్చరర్ విద్యార్థి పైన చేయి చేసుకున్నాడు. అనిల్ కూడా అతని పైన దాడి చేశాడు. ఇద్దరు గాయాలతో పోలీసు స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరి పైన కేసు నమోదు చేశారు. మరోవైపు, విద్యార్థి కాలేజీకి ఆలస్యంగా వచ్చిన అతడిని అధ్యాపకుడు తరచూ ఎందుకు ఆలస్యంగా వస్తున్నావని ప్రశ్నించడంతో ఈ ఘర్షణ జరిగిందని మరో కోణం వినిపిస్తోంది.
తెరాస నేతపై ఆగ్రహం
కాగా, విద్యార్థి, లెక్చరర్ పరస్పరం దాడి చేసుకున్న ఉదంతంలో జూబ్లీహిల్స్కు చెందిన ఓ తెరాస నేత కలగజేసుకునే ప్రయత్నాలు చేశారట. దీంతో ఇన్స్పెక్టర్ ఆయన పైన ఆగ్రహం వ్యక్తం చేశారట. విద్యార్థి, లెక్చరర్ ఘర్షణ పడితే ఆ విషయం మీకెందుకని, మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని వారించారట. చట్ట ప్రకారం ఇద్దరి పైన కేసు నమోదు చేస్తామని, ఇందులో రాజకీయ జోక్యం వద్దని హితవు పలికారట.