టీడీపీ, వైసీపీల శుద్ధి రాజకీయం: రాజధానిలో ఉద్రిక్తత, మోహరించిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల శుద్ధి రాజకీయాలతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల శుద్ధి రాజకీయాలతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించిన ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి పసుపు నీళ్లు చల్లే కార్యక్రమం చేపట్టాయి టీడీపీ శ్రేణులు.
జగన్ పర్యటనతో రాజధాని అపవిత్రం అయిందంటూ తుళ్లూరు మండలంలో పసుపు నీళ్లు చల్లారు. అంతేగాక, సచివాలయం నుంచి మల్కాపురం మండలం వరకు టీడీపీ శ్రేణులు భారీ పాదయాత్ర నిర్వహించాయి.
కాగా, వీరికి పోటీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పసుపు నీళ్లు చల్లుతూ ప్రకాశం బ్యారేజీపై శుద్ధి కార్యక్రమం చేపట్టేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు ప్రయాణించడంతో ఇక్కడంతా అపవిత్రం అయిందంటూ పసుపు నీళ్లు చల్లారు. నిషేదాజ్ఞలున్నా ర్యాలీలు ఎలా చేస్తారని టీడీపీని వైసీపీ నేతలు ప్రశ్నించారు.
అధికార పార్టీ నేతలు చేపట్టే ర్యాలీలకు అనుమతిస్తూ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ఆందోళన విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.
తాడేపల్లి సెంటర్కు టీడీపీ, వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు. భారీ ఎత్తున మోహరించి ఇరువర్గాలను అక్కడ్నుంచి పంపివేసే ప్రయత్నం చేశారు.
కాగా, తాము ఎంతో శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటున్నామని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ మాత్రం ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.