సైలెంట్ పోరు: రంగంలోకి పవన్ కళ్యాణ్! జగన్ సెల్ఫ్గోల్, ఇదీ తేడా
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల మధ్య ప్రతిపక్ష హోదాపై సైలెంట్ పోటీ ప్రారంభమైందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి టీడీపీ, వైసీపీలతో పాటు జనసేన ఏపీలో గట్టిపోటీదారు.
అమరావతి: ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల మధ్య ప్రతిపక్ష హోదాపై సైలెంట్ పోటీ ప్రారంభమైందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి టీడీపీ, వైసీపీలతో పాటు జనసేన కూడా ఏపీలో గట్టిపోటీదారుగా నిలుస్తుందని భావిస్తున్నారు.
ఇప్పుడు కాదు, నాటి నుంచే ప్రారంభం
ఈ పోటీ ఇప్పుడు కాదని అమరావతి రైతుల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినప్పటి నుంచే ఇది ప్రారంభమైందని, త్వరలో పవన్ జనంలోకి రానున్న నేపథ్యంలో ఆ ప్రభావం మరింత కనిపించనుందని అంటున్నారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు లేరని కూర్చోలేదు
పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందే పార్టీ స్థాపించినా పోటీ చేయలేదు. టీడీపీ - బీజేపీ మిత్రపక్షం ఏపీలో గెలవడానికి సహకరించారు. మద్దతిచ్చి ఆయన మౌనంగా కూర్చోలేదు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఆయన గట్టిగా నిలదీస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు లేరని, పార్టీ ఇంకా పూర్తిగా పటిష్టం కాలేదని పవన్ మౌనంగా కూర్చోలేదు.
ఇప్పటి వరకు ఒక్కడి పోరాటం!
పవన్కు అశేష అభిమానులు ఉన్నారు. కానీ పార్టీకి రూపురేఖలు రాలేదు. ఈ నేపథ్యంలో 2014లో టీడీపీ, బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని భూములు మొదలు ప్రత్యేక హోదా వరకు ఒక్కడుగానే నిలదీస్తున్నారు. ఇక ఆయన త్వరలో పార్టీని పటిష్టం చేసేందుకు జనం ముందుకు వస్తున్నారు.
పవన్ ఒత్తిడి తెస్తుంటే
దశాబ్దాలుగా ఉన్న ఉద్ధానం సమస్యపై పవన్ కళ్యాణ్ చొరవ అందరినీ ఆకట్టుకుంది. తన వద్దకు వచ్చే సమస్యలపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీసి, ఒత్తిడి తెచ్చి, అవి సఫలమయ్యేలా చూస్తున్నారు. మరోవైపు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ టీడీపీ ఆయనను అలా చూడటం లేదు. జగన్ పదేపదే చంద్రబాబును విమర్శించడం మినహా ఏం చేయడం లేదంటున్నారు.
జగన్ను ఎప్పటికప్పుడు ఇరుకునపెట్టేలా టీడీపీ
జగన్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారని, పవన్ కళ్యాణ్ సరైన ప్రతిపక్ష నేతగా కనిపిస్తున్నారని టీడీపీ నేతలు అన్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవల 1100ను ప్రతిపక్ష నేతగా చెప్పారు. జగన్ లేవనెత్తిన అంశాలపై టీడీపీ కౌంటర్ ఇస్తుంది. పవన్ లేవనెత్తిన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోంది. తద్వారా జగన్ ప్రాధాన్యతను టీడీపీ ఎప్పటికప్పుడు తగ్గించే ప్రయత్నాలు చేసింది.
జగన్ సెల్ఫ్ గోల్
టీడీపీ ప్రయత్నాలకు జగన్ తీరు కూడా విమర్శలకు తావిస్తోంది. రోజా వ్యవహారం, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం వంటి వాటితో జగన్ కూడా సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు. ఆయన పాదయాత్రకు మద్దతు పలుకుతున్న ఇతర పార్టీల నేతలు, అసెంబ్లీకీ వైసీపీ హాజరు కాకపోవడాన్ని మాత్రం తప్పుబడుతున్నారు.
సాంకేతికంగా జగన్, కానీ
టిడిపి అధికారంలో ఉంది. సాంకేతికంగా ప్రతిపక్షం వైసీపీ. ప్రతిపక్ష నేత వైయస్ జగన్. కానీ తీరు చూస్తుంటే పవన్ కళ్యాణే అసలైన ప్రతిపక్ష నేతగా కనిపిస్తున్నారని అంటున్నారు. ఆయన సమస్యలపై స్పందించి, పరిష్కారం చూపించేలా ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు.
జగన్, పవన్లకు ఇదీ తేడా
జగన్ ఏ సమస్య పైన స్పందించినా.. మరో ఏడాదిలో మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు సమస్యలు తీరుతాయని చెబుతున్నారు. కానీ పవన్.. చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇక్కడే వారి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇక పవన్ జనంలోకి వెళ్తే ఇప్పటి దాకా వారి మధ్య ఉన్న సైలెంట్ పోరు వేడెక్కనుందని అంటున్నారు.