కొట్టుకున్న వైసీపీ, టీడీపీ, వీరంగం: తుని ఎమ్మెల్యేకు గాయాలు
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా డి పోలవరంలోని తాండవ నది ఇసుక రీచ్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ వర్గీయుల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఇసుక ర్యాంపుకు చేరుకొని అనధికారికంగా ఇసుక తరలిస్తున్నారని అక్కడి ట్రాక్టర్లకు తన కారును అడ్డు పెట్టారు.
దీంతో స్థానిక టిడిపి నాయకులు ప్రశ్నించేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యేతో పాటు టిడిపి వర్గీయులకు స్వల్ప గాయాలయ్యాయి. తోపులాటలో ఎమ్మెల్యే అంగరక్షకుడు... సర్పంచి భర్త నూకరాజును నెట్టడంతో తలకు గాయమైంది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే చేతికి స్వల్ప గాయమైంది.
దీనిపై పోలీసులు వివరాలు తెలిపారు. ఇసుక తరలిస్తున్న కొన్ని ట్రాక్టర్లను నిలువరించారు. పంచాయతీ జారీ చేసిన రసీదులను వారి నుంచి తీసుకొని పరిశీలించారు. రసీదు ఇచ్చేందుకు నువ్వెవరంటూ గోవిందు అనే వ్యక్తి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోవిందు భయంతో గ్రామంలోకి వెళ్లాడు. సర్పంచిని, ఆమె భర్త నూకరాజును, ఇతర గ్రామపెద్దలను తీసుకు వచ్చాడు. నూకరాజు ఎమ్మెల్యే వద్దకు వెళ్తుండగా.. అతనిని బెదిరించారు. దానికి నూకరాజు మాట్లాడుతూ.. పంచాయతీ రశీదు ఇచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఎమ్మెల్యే వీరంగం సృష్టించారని చెబుతున్నారు.
అనంతరం ఎమ్మెల్యే అంగరక్షకుడు నూకరాజును నెట్టివేశాడు. దీంతో అతని తలకు గాయమైంది. గన్మన్ను కూడా నూకరాజు కొట్టారని చెబుతున్నారు. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకున్నారు.
మరోవైపు, ఎమ్మెల్యే తన కారును తీసుకొని అక్కడి నుండి వెళ్లబోతుండగా స్థానిక మహిళ కారుకు అడ్డుగా నిలబడింది. ఎమ్మెల్యే కారు ఆమెను ఢీకొంది. దీంతో ఆమె చేతికి గాయమైంది. గాయపడిన నూకరాజు, మహిళ, ఎమ్మెల్యే రాజా తుని ఆసుపత్రిలో చేరారు.