జమిలికి చంద్రబాబు సై - ఏపీలో ముందస్తు, జగన్ కు కలిసొచ్చేనా..!!
ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమా. షెడ్యూల్ ప్రకారం 2029లో జరగాల్సిన ఎన్నికలు 2027 ద్వితీయార్ధంలో జరగనున్నాయా. ఢిల్లీ నుంచి అమరావతి వరకు జరుగుతున్న చర్చలు అవుననే అంటున్నాయి. తాజాగా ఢిల్లీ పర్యటన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు జమిలి ఎన్నికలకు మద్దతు ప్రకటించారు. కేంద్రం జమిలి దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. చంద్రబాబు తాజా ప్రకటన తరువాత ఏపీలో కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది. మాజీ సీఎం జగన్ యాక్షన్ ప్లాన్ ఏంటి. కలిసొచ్చేదెవరికి.
ఏపీలో 2027లోనే ఎన్నికలు..?
ఒకే దేశం-ఒకే ఎన్నికలు. 2024 ఎన్నికలకు ముందే దీనికి సంబంధించి కేంద్రం పక్కా ప్లాన్ తో వ్యవహరించింది. మాజీ రాష్ట్రపతి కోవింద్ తో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం కేంద్రం ఆ రిపోర్టును ఆమోదించింది. శీతాకాల పార్లమెంట్ సమావేశా ల్లో జమిలికి సంబంధించిన బిల్లులను ఆమోదించేలా కార్యారణ సిద్దం అవుతోంది. ఇదే సమయం లో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేత సీఎం చంద్రబాబు సైతం జమిలికి మద్దతు ప్రకటించారు. పార్లమెంట్ తో పాటుగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగటం ఖాయంగా కనిపిస్తోంది.

చంద్రబాబు సిద్దం
షెడ్యూల్ ప్రకారం 2029 మార్చి తరువాత ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, ఢిల్లీ ముఖ్య నేతల్లో జరుగుతున్న చర్చ మేరకు 2027 జూన్ నుంచి ఎప్పుడైనా జమిలి జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు ఖాయమనే అభిప్రాయం ఉంది. దీంతో..ఈ నిర్ణయానికి మద్దతు ప్రకటిస్తూనే.. ఆ దిశగానే పాలనా పరంగా. రాజకీయంగా చంద్రబాబు నిర్ణయాలు అమలు చేసేలా సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకొచే బిల్లుల ద్వారా సాంకేతిక సమస్యలను సైతం అధిగమించి జమిలి నిర్వహణకు మోదీ ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. దీంతో, ఏపీలోనూ 2027 లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే చర్చ బలంగా వినిపిస్తోంది.
కలిసొచ్చేదెవరికి
అదే జరిగితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు మాత్రమే పూర్తవుతుంది. దీంతో.. తమ హామీల అమలు..రాజధాని...పోలవరం చంద్రబాబుకు ప్రధాన అంశాలుగా మారనున్నాయి. జమిలి ఖాయమని భావిస్తున్న వేళ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇదే మూడు పార్టీల కూటమిగా కొనసాగుతారా అనేది కీలక అంశం. మరో వైపు మాజీ సీఎం జగన్ తిరిగి తమకు అధికారం దక్కటం ఖాయమనే ఇప్పటికే చెబుతున్నారు. పార్టీ ప్రక్షాళన నిర్ణయాలు తీసుకుంటూనే..కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో.. ప్రచారం సాగుతున్నట్లుగా 2027లోనే ఎన్నికలు వస్తే ఎవరికి కలిసి వస్తుందనేది ఇప్పుడు కీలక చర్చగా మారుతోంది.












Click it and Unblock the Notifications