విజయవాడ దుర్గ గుడిలో వరుస వివాదాలపై సిఎం చంద్రబాబు సీరియస్...పాలకమండలికి వార్నింగ్
విజయవాడ:విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం పై కనక దుర్గమ్మ గుడిలో వరుస వివాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలిసింది. ఇటీవలి వివాదాలపై సమాచారం తెప్పించుకున్న సిఎం చంద్రబాబుపాలకమండలి అత్యుత్సాహం వివాదాలకు కారణమని తెలిసి వారిని హెచ్చరించారట.
అమ్మవారి గుడిలో ఘనంగా జరుగుతున్న దసరా ఉత్సవాల కన్నా...ఆలయంలో చోటుచేసుకుంటున్న వివాదాలే ఎక్కువగా ప్రచారం లోకి వస్తున్నాయని సిఎం చంద్రబాబు వారిపై మండిపడ్డారట. ఈ క్రమంలో అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పాలకమండలి చైర్మన్ గౌరంగబాబుకు ఫోన్ వెళ్లిందని,
ఆలయంలో వివాదాలకు స్వస్తి చెప్పాలని ఆదేశాలు అందాయని అంటున్నారు.ఈ సందర్భంగా సిఎం పాలక మండలిని ఉద్దేశించి మాట్లాడుతూఅధికారులతో మీరంతా సమన్వయంతో పని చేయాలని సూచించారని, తీరు మారకుంటే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని హెచ్చరించారని తెలిసింది. మరోసారి పాలకమండలి సభ్యుల కారణంగా వివాదం తలెత్తినట్లు తెలిస్తే పాలమ మండలిని రద్దు చేసేందుకు ప్రభుత్వం వెనకాడదని సిఎం స్పష్టం చేసినట్లు సమాచారం.
ఇదిలావుంటే ఇంద్రకీలాద్రిపై జరిగే గొడవలకు,అవమానాలకు అసలు కారణం ఏమిటా అని కొందరు మీడియా మిత్రులు ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయం ఒకటి బైటపడిందట. అసలు ఈ వివాదాలకు కారణం తాళాలట...ఆ తాళాల వల్లే ఈ తిప్పలన్నీ తలెత్తుతున్నాయట. అదెలాగంటే?...సాధారణ భక్తులకు దర్శనంలో ఇబ్బందులు తలెత్తకుండా శీఘ్ర దర్శనాలకు వీలయ్యే కొన్ని ద్వారాలు ఉన్నాయి.
ఈ క్రమంలో పాలక మండలి సభ్యులు, డ్యూటీ పాసులు, ఇతర పాసులు కలిగిన వారు తమ వ్యక్తిగత ప్రాబల్యం చూపించుకునేందుకు తమకు సంబంధించిన భక్తులను క్యూ లైన్లలో కాకుండా ఈ ఇతర ద్వారాల వారికి శ్రీఘ్రదర్శనాలు చేయిస్తున్నారట. దీనితో క్యూ లైన్ లలో వచ్చే భక్తులకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో అలా జరగకుండా కొన్ని ద్వారాలను ఆలయ అధికారులు మూసేసి తాళాలు వేసేశారట.
ఈ క్రమంలో తమ వారితో వచ్చిన పాలక మండలి సభ్యులు, ఇతర విఐపిలు తమ వారికి శీఘరదర్శనం చేయించేందుకు ఆయా ద్వారాలు తెరవాలంటూ వాదనకు దిగుతుండటంతో గొడవలు తలెత్తుతున్నాయట. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా చేసిన ఈ ఏర్పాటును తమ వ్యక్తిగత ప్రాబల్యం కోసం మీరుతుండటం, అందుకోసం పదే పదే అధికారులను విసిగించడం సమంజసం కాదని, సరిగ్గా ఇదే విషయం సిఎం చంద్రబాబుకు తెలియడంతో ఆయన ఆలయ అధికారులకు సహకరించాలని పాలకమండలిని ఆదేశించారని అంటున్నారు.