చంద్రబాబు సహా మంత్రులు ఇక్కడే: రాజమండ్రి కేంద్రంగా ఏపీ పాలన
రాజమండ్రి: ప్రస్తుతం రాజమండ్రి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన సాగుతోన్నట్లుగా కనిపిస్తోంది. గోదావరి పుష్కరాలు నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందే రోజు రాజమండ్రి వచ్చారు. మంత్రులు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లోని పుష్కరాలు జరిగే ప్రాంతంలో ఉన్నారు.
వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు కూడా పుష్కరాలు జరిగే ప్రాంతంలో ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కొంతమంది అధికారులు రాజధాని కేంద్రంలో ఉంటూ ప్రభుత్వ పనులను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణారావు పాలనకు సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమాచారం అందిస్తున్నారు.
మంత్రులందరికీ సిఎం చంద్రబాబు వేర్వేరు బాధ్యతలు అప్పగించారు. వాటిని విజయవంతం చేసేందుకు మంత్రులు తమ వంతు కృషి చేస్తున్నారు. పుష్కరాల్లో... దేవాదాయ, ధర్మాదాయ శాఖతో పాటు, రోడ్లు భవనాలు, పంచాయితీరాజ్, వైద్యం ఆరోగ్యం, తాగునీరు, మున్సిపల్ వ్యవహారాలు, శాంతిభద్రతలు, విద్య తదితర శాఖలన్నీ భాగస్వామ్యమవుతున్నాయి.
పుష్కరాలపై దేవాదాయ శాఖ కమిటీలు వేసింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు మంత్రులు, ఉన్నతాధికారులతో వేర్వేరుగా మరో రెండు కమిటీలు వేశారు. సాంస్కృతిక శాఖ కార్యక్రమాల కోసం మరో కమిటీ వేశారు.
ఇదిలా ఉండగా, వివిధ శాఖలు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియచేసేందుకు, ప్రచారం కల్పించేందుకు పుష్కరాలు జరిగే అన్ని రోజుల్లో ఎగ్జిబిషన్లు, వర్క్షాపులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నీరు-చెట్టు కార్యక్రమంపై బుధవారం ఒక సెమినార్ జరిగింది.
గురువారం అడవులు, వాతావరణ కాలుష్యంపై వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 24 వరకు ప్రతిరోజూ జరిగే కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు, అధ్యక్షత వహించేందుకు మంత్రులకు అధికారం ఇచ్చారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు రాజమండ్రి, తదితర పట్టణాల్లో మకాం వేసి ఉండటంతో హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం బోసిపోయింది. మంత్రులు, అధికారులు లేకపోవడంతో విజటర్లు పెద్దగా రావడం లేదు.