సర్వేను లైట్గా తీసుకోవద్దు: అధికారులకు చంద్రబాబు వార్నింగ్
అమరావతి: చారిత్రాత్మకమైన ప్రజా సాధికార సర్వేను ఆషామాషీగా తీసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రజా సాధికార సర్వే తీరుతెన్నులపై గురువారం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలో నెలకొన్న సాంకేతిక సమస్యలను అధిగమించాలని అధికారులకు సూచించారు.
జిల్లాలల్లో సర్వర్ల సామర్ధ్యాన్ని పెంచాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. సర్వేలో సేకరించిన సమాచారం కచ్చితత్వాన్ని సరిచూసుకోవాలని, సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీతో పాటు త్వరలో జరగనున్న కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని సర్వే కాల వ్యవధి తగ్గే విధంగా పనిచేయాలని సూచించారు.
మండల స్థాయిలో తహసీల్దార్, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్ సర్వేను పర్యవేక్షించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్చంద్ర, ఉన్నతాధికారులు ఏసీ పుణీఠా, ఐటీ కార్యదర్శి ప్రద్యుమ్న, పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే పుష్కరాలకు పక్షం రోజుల వ్యవధి మాత్రమే మిగిలివుండడంతో అన్నీ శాఖలు తమకు కేటాయించిన పనుల్లో వేగం పెంచాయి. ప్రకాశం బ్యారేజిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు జలవనరుల శాఖ సిద్ధమైంది. బ్యారేజికి రంగులు దిద్దే పనులతో పాటు దేదీప్యమానంగా వెలిగిపోయేలా ప్రత్యేక విద్యుదాలంకరణ చేసే పనులను ఆరంభించారు.
ఉండవల్లి సెంటరు నుంచి సీతానగరం ఘాట్ను చేరుకునే మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డును విస్తరిస్తున్నారు. ఉండవల్లి స్ర్కూ బ్రిడ్జి నుంచి బోటు యార్డుకు వెళ్లే మార్గంలోని మలుపును బాగా విస్తరించి ఇరువైపులా కాంక్రీట్ రక్షణ గోడలను పటిష్టంగా నిర్మిస్తున్నారు.