పుష్కరాల్లో విషాదం: 27మంది భక్తులు మృతి, బాబు దిగ్భ్రాంతి
రాజమండ్రి: తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు మంగళవారం నాడు ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏఫీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో పుష్కర స్నానం చేశారు. ఆయనతో పాటు పలువురు పీఠాధిపతులు, వేద పండితులు స్నానం ఆచరించారు.
చంద్రబాబు సకుటుంబ సమేతంగా పుష్కరాలకు హాజరయ్యారు. ఈ నెల 25వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పుష్కరాలు ఉంటాయి. టిటిడి తరఫున చంద్రబాబు గోదావరికి చీర, సారెలను సమర్పించారు. అనంతరం పుష్కర ఘాట్లను ప్రారంభించారు. కొవ్వూరులో కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్నానం ఆచరించారు.
స్నానాలు చేసిన అఘోరాలు
నర్సాపురం వలంధర్ రేవులో ఆరుగురు అఘోరాలు పుష్కర స్నానం చేశారు. ఈ ఘాట్లో ఎంపీలు తోట సీతారామలక్ష్మి, గోకరాజు రంగరాజు, ఎమ్మెల్యే మాధవనాయుడు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడులు స్నానం చేశారు.
పుష్కర ఘాట్కు పోటెత్తిన భక్తులు: తోపులాట, సొమ్మసిల్లారు, 27 మంది మృతి
రాజమండ్రిలోని పుష్కర ఘాట్కు భారీగా భక్తులు పోటెత్తారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. దీంతో తోపులాట జరిగింది. పలువురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. తోపులాట ఘటనలో 27 మంది భక్తులు మృతి చెందారు.
ఓకే ఘాట్ వద్దకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. కోటగుమ్మం వద్ద ఇది జరిగింది. మృతుల్లో రుద్రరాజు లక్ష్మి (65) అనే మహిళ ఉన్నారు. గాయపడిన వారిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. భక్తుల మృతిపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చంద్రబాబు, చినరాజప్ప సమీక్షిస్తున్నారు.
ఆర్టీసీ ఛార్జీల పెంపు తెలంగాణ ఆర్టీసీ బస్సులోనే..
పుష్కరాలకు వచ్చే భక్తులపై అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించిన నేపథ్యంలో ఏపీలో భక్తులకు ఊరట లభించింది. సిఎం అదేశాల మేరకు ప్రత్యేక బస్సుల్లోను సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తారు. అదే సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మాత్రం 50 శాతం అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు.