పులివెందులపై సీఎం సంచలన ప్రకటన! జగన్ కోటలో ‘కేస్ స్టడీ’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేవలం పరిపాలనా సంస్కరణలకే పరిమితం కాకుండా, ప్రత్యర్థుల కోటల్లోనే వారి వ్యూహాలకు చెక్ పెట్టే సరికొత్త 'ఎకనామిక్ పాలిటిక్స్'కు తెరలేపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలాన్ని రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఒక రోడ్ మ్యాప్గా, కేస్ స్టడీగా చంద్రబాబు ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సచివాలయంలో సోమవారం జరిగిన విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్ల ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం చేసిన వ్యాఖ్యలు అటు లీడర్లకు, ఇటు అధికారులకు సరికొత్త దిశా నిర్దేశం చేశాయి.
జగన్ కోటలోనే 'బాబు' సక్సెస్ ఫార్ములా!
వైసీపీకి కంచుకోట లాంటి పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఉద్యానవన (హార్టికల్చర్) పంటల సాగు ద్వారా ప్రజల తలసరి ఆదాయం ఏకంగా రూ. 7.30 లక్షలకు చేరింది. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతాల కంటే కూడా ఈ వెనుకబడిన సీమ మండలంలో ఆదాయం ఇంతలా పెరగడంపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

రాయలసీమకు 100,000 కోట్ల బూస్ట్.. వైఎస్సార్ జిల్లాకు భారీ ప్రాధాన్యత!
తిరుపతి ఎకనామిక్ రీజియన్ (TER) అభివృద్ధికి హార్టికల్చర్ రంగాన్నే ప్రధాన గ్రోత్ ఇంజిన్గా చంద్రబాబు ఎంచుకున్నారు. పూర్వోదయ పథకం కింద రూ. 40,000 కోట్లు, అలాగే ప్రైవేట్ పెట్టుబడుల రూపంలో మరో రూ. 60,000 కోట్లను ఈ ప్రాంతానికి రాబట్టడం ద్వారా రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మార్చాలన్నది బాబు మాస్టర్ ప్లాన్. పులివెందుల, కడప పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మార్చాలని సీఎం స్పష్టం చేశారు. ఈ వ్యూహం సక్సెస్ అయితే, జగన్ సొంత జిల్లాలోనే ఉపాధి కల్పన ద్వారా కూటమి ప్రభుత్వం పొలిటికల్ మైలేజ్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
0.90 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో.. 9 జిల్లాల ఆపరేషన్!
తిరుపతి ఎకనామిక్ రీజియన్ పరిధిలోకి వచ్చే తిరుపతి, నెల్లూరు, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అన్నమయ్య లాంటి 9 జిల్లాలను సమగ్రంగా మార్చేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని సైతం నియమించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ లో భాగంగా ఏపీ 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలనే లక్ష్యంలో.. కేవలం రాయలసీమ రీజియన్ నుంచే 0.90 ట్రిలియన్ డాలర్లు సాధించాలని టార్గెట్ పెట్టారు. విశాఖ, అమరావతి రీజియన్లతో పోటీ పడేలా తిరుపతి రీజియన్ను నిలబెట్టడం ద్వారా రాయలసీమలో వెనుకబాటుతనం అనే ముద్రను చెరిపేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
6 నెలల్లో మాస్టర్ ప్లాన్.. ముందే ప్రజాభిప్రాయ సేకరణ!
గత ప్రభుత్వంలో మాదిరి ఏకపక్ష నిర్ణయాలు కాకుండా, 6 నెలల్లో అమరావతి, తిరుపతి రీజియన్ల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిన తర్వాత, దాని ముసాయిదాను ప్రజలు, ప్రజాప్రతినిధుల ముందు ఉంచి చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. రెండు నెలల్లో ప్రతి జిల్లాకు 'డిస్ట్రిక్ట్ ఎకనమిక్ ప్రొఫైల్' సిద్ధం కానుంది. లింగాల మండలంలో హార్టికల్చర్ తెచ్చిన సిరుల విప్లవాన్ని బేస్ చేసుకుని, పులివెందుల గడ్డపైనే సూపర్ సక్సెస్ మోడల్ను చూపించి వైఎస్సార్ జిల్లా రాజకీయాల్లో సరికొత్త జెండా ఎగురవేయాలని కూటమి ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.














Click it and Unblock the Notifications