ప్రజలను మెప్పించే అధికారులు కావలెను:ఎన్నికల కోసం సిఎం చంద్రబాబు కసరత్తు షురూ!...
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక అతి ముఖ్యమైన పనిలో తలమునకలుగా ఉన్నారు. అది ప్రజలను మెప్పించే సామర్థ్యం, స్వభావం కలిగిన అధికారుల కోసం జల్లెడ పట్టడం!...
అధికార పార్టీ హోదాలో ప్రజల మెప్పు పొందామన్న సంతృప్తితో వచ్చే ఎన్నికలను ఎదుర్కొనేలా ఫినిషింగ్ టచ్ ఇవ్వగలిగే అధికారుల కోసం సిఎం చంద్రబాబు ఇప్పుడు అన్వేషణ సాగిస్తున్నారు...టిడిపి అధికారం చేపట్టి నాలుగేళ్లు గడచిపోయాయి...ఈ క్రమంలో తరువాత దఫా సార్వత్రిక ఎన్నికలు అంతకంతకూ దగ్గర పడుతున్నాయి. దీంతో టిడిపి ప్రభుత్వం పనితీరుపై ప్రజల్లో సానుకూల దృక్పధం పెంచే అధికారుల అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని సిఎం భావిస్తున్నారు.
అలాంటి...అధికారులు కావలెను!
ప్రజలతో సన్నిహితంగా మెలగాలి...వారిని మెప్పించాలి...ఒప్పించాలి...ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారివద్దకు సకాలంలో సమర్థవంతంగా చేరవేయాలి...అన్యాయం జరగకూడదు...అక్రమాలకు అవకాశం ఇవ్వకూడదు...ఈ అన్ని లక్షణాలతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి...ఇవీ ఇప్పుడు సిఎం చంద్రబాబు అన్వేషిస్తున్న ఎన్నికల టీంలో ఎంపిక చేయబోయే అధికారులకు ఉండాల్సిన లక్షణాలు. అలాంటి అధికారులు వీలైనంత ఎక్కువమందికి పరిపాలనలో కీలక బాధ్యతలు అప్పగిస్తే తాను వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడం మరింత సులభమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది.
అధికారులపై...ప్రజల్లో అసంతృప్తి
ప్రజాప్రతినిథుల సంగతి పక్కనబెడితే పరిపాలన ఫలాలు ప్రజలకు దక్కడంలో అధికారులదే అత్యంత కీలకపాత్ర అనేది తెలిసిన విషయమే. అయితే ఇటీవలి కాలంలో కొందరు ఉన్నతాధికారులు సమర్థవంతగా వ్యవహరించలేకపోవడం, ఇతరత్రా ఆరోపణలు ఎదుర్కోవడం సిఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. అదే సమయంలో మరికొందరు అధికారులు నిజాయితీగా ఉంటున్నా...వారు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న అరోపణలు ఎదుర్కొంటున్నట్లు సిఎంకు తెలిసింది. దీనివల్ల పాలన,పథకాల అమలుపై కొన్ని సందర్భాల్లో ప్రజల్లో అసంతృప్తి రావడం...ప్రభుత్వం పట్ల కొన్ని సందర్భాల్లో వ్యతిరేకత వ్యక్తం అవడానికి కారణమవుతోందని సిఎం చంద్రబాబు భావిస్తున్నారట.
ఇదే కీలక సమయం...అందుకే ఆ అధికారులు
ఇక సార్వత్రిక ఎన్నికలకు సుమారుగా ఎనిమిది నెలల సమయం ఉందనుకుంటే...ఆ లోపు ప్రజలకు టిడిపి ప్రభుత్వం మరింత చేరువయ్యేలా ఎన్నికల టీం కూర్పు ఉండాలని సిఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అందుకోసం కసరత్తు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిఎంవో అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక చర్చలు జరుపుతున్నారని సమాచారం. నిజాయితీ, సమర్థతతో పాటుగా ప్రజలతో కలుపుగోలుగా ఉండగలిగే అధికారుల వివరాలు తెలపాల్సిందిగా సిఎం వారికి సూచించారట.
ఈ క్రమంలో...భారీగానే బదిలీలు
దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలతో పాటు వివిధ శాఖాధిపతులకు స్థానచలనం తప్పదని తెలుస్తోంది. జిల్లాల్లో ప్రభుత్వానికి అన్నీ తామై వ్యవహరించేది కలెక్టర్లే కాబట్టి ప్రధానంగా కలెక్టర్ల విషయమై లోతుగా చర్చ జరుగుతోందట. ఆ తర్వాత శాంతిభద్రతలు, ఇతరత్రా వ్యవహారాల్లో ఎస్పీల పాత్ర కీలకం. కాబట్టి వారి గురించి సరేసరి. ఎక్కువమంది కలెక్టర్లు బాగానే ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా రెండు జిల్లాల కలెక్టర్ల విషయంలో మాత్రం అసంతృప్తి అధిక మోతాదులోనే ఉందని...వారు పాలనను సమతూకంగా సాగించడంలో నేర్పుగా వ్యవహరించలేకపోతున్నారనే భావన అక్కడి ప్రజల్లో ఉందని తెలియడంతో...వారి పనితీరుపై పూర్తిస్థాయిలో సమాచారం సేకరించారు. వారితో పాటు కొందరు కలెక్టర్లు మూడేళ్లు పూర్తిచేసుకున్నవారు ఉండటం...ఎన్నికల నాటికి మూడేళ్లు పూర్తిచేసుకున్న కలెక్టర్లు ఉండకూడదనే నిబంధన ఉండటంతో...దాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని కూడా మార్చనున్నారు.
అయినా...ఇలా చేయాల్సిందే
అయితే కొందరు ఉన్నతాధికారులు తాము చెప్పిన పనులు చేయడం లేదంటూ ప్రజాప్రతినిధులు సిఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారట. దీనిపై స్పందించిన సిఎం... ఏవైనా సొంత లాభం కోసం వారు పైరవీ పనులు తీసుకొస్తే చేయాల్సిన పనిలేదని, కానీ ప్రజాప్రయోజనాలకు సంబంధించినవైతే మాత్రం చేయాలని ఆయన నిర్దేశిస్తున్నారట. ఏదేని పనిగురించి ఎవరైనా ప్రజాప్రతినిధి అధికారులకు సిఫార్సు చేస్తే...అది ప్రజలకు మేలు చేసేదే అయినా సిఫార్సు చేయిస్తారా అంటూ భిన్నంగా స్పందిస్తున్నారట.
త్వరలోనే...కొత్త టీం
ప్రభుత్వం-ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రజాకోణంలో పనిచేయాలే తప్ప...ప్రతి పనిలోను వేరే ఏదో ఉద్దేశ్యం దాగి ఉందనే ఊహతో ప్రజలకు సంబంధించిన పనులు చేయకపోవడం సరైంది కాదని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎవరు చెప్పినా...ఏమి చెప్పినా సానుకూల దృక్పథంతో తీసుకోవాలని...అప్పుడే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని ఆయన అంటున్నారట. ఆ దిశలో తనకు ఉపయోగపడే అధికారుల బృందాన్ని ఎంపిక చేసి ఎన్నికల టీంగా రంగంలోకి దింపేందుకు సిఎం చంద్రబాబు త్వరలోనే కసరత్తు పూర్తిచేయనున్నట్లు తెలిసింది.