నేడు కిడారి, సోమా కుటుంబాలకు సిఎం పరామర్శ:విదేశీ పర్యటన ముగించి విజయవాడకు చేరుకున్న చంద్రబాబు
అమరావతి:మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం పరామర్శించనున్నారు.
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టు నక్సలైట్లు కాల్చిచంపిన ఘటన జరిగిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అరుదైన అవకాశం రావడం వల్ల పర్యటనను అర్థాంతరంగా ముగించలేకపోయినట్లు ఆ సందర్భంలో వెల్లడించిన చంద్రబాబు తదనంతరం తన విదేశీ పర్యటనను ముగించుకుని శుక్రవారం ఉదయానికి విజయవాడకు చేరుకున్నారు.
పాలనకు సంబంధించిన అత్యవసర విషయాలను విజయవాడ నుంచే సమీక్షించి అనంతరం ఉదయం 10 గంటల సమయంలో ఆయన ఇక్కడ నుంచి విమానంలో విశాఖకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆ తరువాత అక్కడ పోలీసు అధికారులతో మాట్లాడి వెంటనే అక్కడినుంచి హెలికాప్టర్లో అరకు చేరుకుంటారని తెలిసింది. అక్కడ మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సోమ కుటుంబ సభ్యులను సిఎం చంద్రబాబు పరామర్శిస్తారు.
అంతకుముందు అమెరికా పర్యటన ముగించుకొని విజయవాడకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్ల రవీంద్ర తదితరులు ఘన స్వాగతం పలికారు. సిఎం చంద్రబాబు ఐక్యరాజసమితిలో ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగించేందుకు అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే అక్కడ ఎన్నారైల సభలో పాల్గొనడంతో పాటు పెట్టుబడిదారుల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఇదిలావుంటే నేడు మంత్రి నారా లోకేష్ మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమ కుటుంబాలను మంత్రి నారా లోకేష్ పరామర్శించనున్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పర్యటన యథాతధంగా కొనసాగనుందా?...లేక రద్దయిందా అనే విషయం వెల్లడి కావాల్సి ఉంది. ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యే లపై మావోయిస్టుల దాడి నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ పేరు చర్చకు రావడంతో ఆయన ఈ పరిస్థితుల్లో హతుల కుటుంబాల పరామర్శకు వెల్లడం క్షేమం కాదనేది అటు పోలీసులు, ఇటు పార్టీ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. మంత్రి లోకేష్ పర్యటన వివరాలు మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశం ఉంది.