వైసీపీకి చంద్రబాబు వార్నింగ్: దివాళాకోరు పార్టీ, గొడవలు పెట్టుకోవడానికే వస్తారు..
ఇలాంటి ప్రవర్తనతో జనంలో పరపతి పెరుగుతుందని వైసీపీ భావిస్తోందని, కానీ దీనివల్ల వారి పరపతి మరింత దిగజారుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య పరస్పర దూషణల పర్వం కొనసాగుతోంది. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వట్లేదని స్పీకర్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో.. ప్రతిపక్షం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
విపక్ష నాయకుల ప్రవర్తన సభలో హుందాగా లేదని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ అన్నా.. స్పీకర్ అన్నా విపక్ష సభ్యులకు గౌరవం లేదన్నారు. ఇంతలో విపక్ష సభ్యులు చంద్రబాబు వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పడంతో.. రన్నింగ్ కామెంటరీ చేస్తే కోపం రాదా? అంటూ ఆయన ప్రశ్నించారు. వైసీపీ దివాళా కోరు పార్టీగా తయారైందని ఎద్దేవా చేశారు.
ఇలాంటి ప్రవర్తనతో జనంలో పరపతి పెరుగుతుందని వైసీపీ భావిస్తోందని, కానీ దీనివల్ల వారి పరపతి మరింత దిగజారుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ దేశంలో ఎవరైనా అవినీతిపరులు ఉన్నారంటే.. అది మీరూ.. మీ నాయకుడు తప్ప ఇంకొకరు లేరంటూ వైసీపీని చంద్రబాబు విమర్శించారు. గొడవలు పెట్టుకునేందుకే వైసీపీ నేతలు అసెంబ్లీకి వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరికి మీడియా పాయింట్ లోను గొడవకు దిగారని, అక్కడ కూడా మార్షల్స్ ను పెట్టాలని అన్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అవినీతికి తావు లేకుండా అమలు పరుస్తున్నామని చెప్పిన చంద్రబాబు.. అభివృద్దిలో తాము నంబర్ 1 అయితే, అవినీతిలో వైసీపీ నంబర్ 1 అని ఎద్దేవా చేశారు. సభలో వైసీపీ నేతల ప్రవర్తన పట్ల తాను వార్నింగ్ ఇస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications