బాబు సహా అందరూ హైద్రాబాద్ టు బెజవాడ: విభజన రోజు నాటికి ఆఫీస్లు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జూన్ 2వ తేదీలోగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జలవనరుల శాఖ కార్యాలయం, మంత్రులు, శాఖాధిపతుల కార్యాలయాల కోసం కూడా భవనాలను పరిశీలించనున్నారు.
జూన్ 2న సమైక్య ఏపీ విడిపోయి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. ఆ రోజు నాటికి సీఎం క్యాంప్ ఆఫీస్, ప్రధాన కార్యాలయాలు విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
జూన్ రెండు నుంచి వారంలో మూడు రోజులు విజయవాడలో ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులను ఆదేశించారు. దీంతో, విడిదిపై అధికారులు దృష్టి సారించారు.
గృహం కోసం ఎన్నారైలకు చెందిన నాలుగు ఇళ్లను అధికారులు సిద్ధం చేశారు. 25వ తేదీలోగానే క్యాంప్ కార్యాలయం సిద్ధం కావొచ్చని తెలుస్తోంది. చంద్రబాబు ఉండేందుకు ఇళ్లు, క్యాంప్ కార్యాలయాలకు వాస్తును పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇందుకోసం వాస్తును పండితులు పరిశీలిస్తున్నారు.
ఏపీ ఉద్యోగుల తరలింపుపై మంత్రివర్గ ఉపసంఘం
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల తరలింపు పైన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉపసంఘంలో సభ్యులుగా మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వర రావు, పీ నారాయణలు ఉన్నారు. సాధ్యమైనంత ఎక్కువ భాగాలను తరలించేందుకు ఉపసంఘం చర్యలు తీసుకుంటుంది.