విభజన: మాజీ డిజిపిలతో భేటీ, సిఎంపై చాకో వ్యాఖ్య
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో రేపు మంగళవారం కేంద్ర హోం శాఖ కీలకమైన సమావేశాన్ని నిర్వహించనుంది. ఆంద్రప్రదేశ్లోని శాంతిభద్రతలపై హైదరాబాదులో ఈ కీలకమైన సమావేశం నిర్వహించనుంది. రాష్ట్ర డిజిపిలుగా పనిచేసిన మహంతి, అరవిందరావు, ఆంజనేయ రెడ్డి, హెచ్జె దొరలను కేంద్ర హోంశాఖ ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు సమాచారం.
వారితో పాటు సర్వీసులో ఉన్న 20 మంది ఐపియస్ అధికారులను కూడా సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. విభజన తర్వాత తలెత్తే శాంతిభద్రతలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సమావేశం సీనియర్ అధికారి విజయకుమార్ నేతృత్వంలో ఏర్పడిన ఐదుగురు సభ్యుల టాస్క్ఫోర్స్ హైదరాబాదులో రేపు జరుగుతోంది.
సిఎం వ్యాఖ్యలు కొత్త కాదు: చాకో
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాజ్యాంగబద్దంగానే జరుగుతోందని ఎఐసిసి అధికార ప్రతినిధి పిసి చాకో అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు కొత్త కాదని, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసు రెండు విడిపోయిన మాట వాస్తవమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజ్యాంగం గురించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కన్నా ప్రధాని మన్మహన్ సింగ్కు ఎక్కువ తెలుసునని ఆయన అన్నారు గత 50 ఏళ్లలో ఎవరూ తీసుకోని సాహసోపేతమైన నిర్ణయాన్ని తమ పార్టీ తీసుకుందని ఆయన చెప్పారు.
తెలంగాణ బిల్లుకు మద్దతు: జవదేకర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు పార్లమెంటులోనూ శాసనసభలోనూ తాము మద్దతు ఇస్తామని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధాని మన్మోహన్ సింగ్కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాయడం క్రమశిక్షణారాహిత్యమేనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రిపై కాంగ్రెసు అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన అడిగారు. దీన్నిబట్టి తెలంగాణపై కాంగ్రెసు చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుందని ఆయన అన్నారు.