అటు సీఎం జగన్..ఇటు పవన్: రాజధాని గ్రామాల్లో హై అలెర్ట్: భారీగా పోలీసు బలగాలు..!
అమరావతిలో హై అలెర్ట్. ప్రకాశం బ్యారేజి నుండి సచివాలయం వరకు 144 సెక్షన్. యాక్ట్ 30 అమలు చేస్తున్న పోలీసులు. సచివాలయం దారి వెంబటి భారీగా పోలీసుల మొహరింపు. ప్రతీ ఒక్కరినీ నిశితంగా పరిశీలిస్తున్న పోలీసులు. మందడం గ్రామంలో షాపుల మూసివేత. ఒక వైపు ముఖ్యమంత్రి జగన్ సచివాలయానికి వస్తున్నారు. అదే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల్లో రైతులకు మద్దతు గా పర్యటిస్తున్నారు.
14 రోజులుగా రాజధాని గ్రామాల్లో రైతులు..స్థానికులు ఆందోళన చేస్తున్నారు. రాజధాని తరలింపు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఈ 14 రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 27న జరిగిన కేబినెట్ సమావేశం కోసం సచివాలయానికి వచ్చారు. తిరిగి ఈ రోజు వస్తున్నారు. అదే విధంగా.. పవన్ సైతం మందడంతో పాటుగా తుళ్లూరు..వెలగపూడి గ్రామాల్లో పర్యటించనున్నారు. దీంతో..పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యలు చేపట్టారు.
జగన్ రెడ్డి ఒప్పుకున్నాకే కదా..: 'రాజధాని’పై ఏపీ సర్కారుకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక
సచివాలయానికి సీఎం జగన్..
ముఖ్యమంత్రి జగన్ వెలగపూడిలోని సచివాలయానికి వస్తున్నారు. ముఖ్యమంత్రి సచివాలయానికి రావటంలో విశేషం లేదు. కానీ, ఆయన ప్రతిపాదిస్తున్న రాజధాని తరలింపు పైన అమరావతి ప్రాంత గ్రామాల ప్రజలు..రైతులు ఆగ్రహంతో ఉన్నారు. 14 రోజులుగా దీక్షలు..నిరసనలు చేస్తున్నారు. మందడం మీదుగా ముఖ్యమంత్రి సచివాలయానికి చేరుకోవాల్సి ఉంది.
అయితే, అదే గ్రామం కేంద్రంగా పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ నెల 27న సైతం అదే గ్రామంలో పెద్ద ఎత్తున పోలీసు సహారా మధ్య సీఎంతో సహా మంత్రులు సచివాలయానికి చేరుకున్నారు. ఆ తరువాత తిరిగి ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి అధికారిక సమీక్షలు చేయనున్నారు. సీఎం వచ్చే మార్గంలో నిరసనలు వ్యక్తం చేయకుండా పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. మందడం గ్రామం మొత్తం ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. దుకాణాలు మూసివేయించారు. నిరసనలకు అవకాశం లేకుండా అక్కడ అనుమతి నిరాకరించారు.
పవన్ కళ్యాణ్ పర్యటన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆయన తొలుత రైతులు ధర్నా చేస్తున్న గ్రామాలకు వెళ్లి సంఘీభావం ప్రకటించాలని భావించారు. అయితే, ముఖ్యమంత్రి సైతం అదే సమయంలో వస్తుండటంతో సమయం మార్చుకోవాలని పోలీసులు సూచించినట్లు సమాచారం. దీంతో..వపన్ తొలుత ఎర్రబాలెంలో రైతుల ధర్నాలో పాల్గొంటారని పార్టీ ప్రకటించింది.
ఆ తరువాత పవన్ తుళ్లూరు..వెలగపూడి..మందడం గ్రామాల్లో రైతుల దీక్షా శిబిరాల వద్దకు వెళ్లి వారితో చర్చిస్తారు. వారి ఆందోళనక కారణాలు తెలుసుకోవటంతో పాటుగా..వారి డిమాండ్లు తెలుసుకొనే ప్రయత్నం చేస్తారు. పవన్ ఇదే కార్యక్రమం వేదికగా రైతులకు మద్దతుగా జనసేన కార్యాచరణ ఏంటనేది వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే విజయవాడకు జనసేన నేతలు భారీగా చేరుకున్నారు.
అమల్లో144 సెక్షన్ ..యాక్ట్ 30
అటు సీఎం జగన్..ఇటు పవన్ ఒకే మార్గంలో రానుండటంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజీ నుండి సచివాలయం వరకు సెక్షన్ 144 అమలు చేసారు. అదే విధంగా యాక్ట్ 30 అమలు చేస్తున్న ట్లు పోలీసులు ప్రకటించారు. ధర్నాలు, నిరసనలకు అనుమతి నిరాకరించారు. మెయిన్ సెంటర్తో పాటు గల్లీల్లో ఉన్న షాపులను సైతం పోలీసులు మూయించేస్తున్నారు.
అయితే పోలీసుల తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకోనివ్వరా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనికి స్పందించిన పోలీసు అధికారులు మధ్యాహ్నం తర్వాత అనుమతి విషయంపై ఆలోచిస్తామంటూ సమాధానం ఇచ్చారు. దీంతో..ఇప్పుడు రాజధాని గ్రామాల్లో హై అలెర్ట్ కొనసాగుతోంది.