మానవీయ కోణంలో స్పందించిన సీఎం జగన్... ఆ ఒడిశా కూలీల కుటుంబాలకు రూ.3లక్షలు ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. గుంటూరు జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు ఒడిశా కూలీలు మృతి చెందిన ఘటనపై మానవీయ కోణంలో సీఎం స్పందించారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరుపున రూ.3లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఈ ఆర్థిక సాయాన్ని అందజేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో గురువారం(జులై 29) జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు ఒడిశా కూలీలు సజీవదహనమయ్యారు. పగలంతా రొయ్యల చెరువులకు కాపలాగా ఉన్న ఈ కూలీలు... రాత్రిపూట రేకుల షెడ్డులో గాఢ నిద్రలో ఉన్న సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. షెడ్డుపై విద్యుత్ తీగలు పడటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. ఈ మంటల్లో నబీన్ సబార్ (23), పండబూ సబార్ (18), మనోజ్ సబార్ (18), కరుణకార్ సబార్ (18), రామ్మూర్తి సబార్ (19), మహేంద్ర సబార్ (20) అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అదే గదిలో మరో నలుగురు కూడా నిద్రించగా... ప్రమాదం నుంచి వారు సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాద ఘటనపై పోలీసులు స్పందిస్తూ... లంకెవానిదిబ్బలోని మండలి బెయిలీ అనే వ్యక్తికి చెందిన రొయ్యల చెరువుల్లో వీరంతా కూలీలుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. 15 రోజుల క్రితమే మొత్తం 25 మంది యువకులు ఒడిశా నుంచి బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. పగలంతా రొయ్యల చెరువుల వద్ద వీరు కాపలాగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. రాత్రిపూట ఆ చెరువుల వద్దే ఏర్పాటు చేసిన షెడ్లలో నిద్రిస్తున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో ఎప్పటిలాగే గురువారం(జులై 29) రాత్రి భోజనలయ్యాక అంతా నిద్రకు ఉపక్రమించినట్లు చెప్పారు. అర్ధరాత్రి వేళ షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని... దట్టమైన పొగ వ్యాపించిందని చెప్పారు. గదిలో మొత్తం 10 మంది నిద్రించగా నలుగురు సురక్షితంగా బయటపడ్డారని... మిగతా ఆరుగురు అదే గదిలో సజీవదహనమయ్యారని తెలిపారు.












Click it and Unblock the Notifications