ఎన్నికలకు వైసీపీ కొత్త టీం.. జగన్ మార్క్ ఎంపిక..!
ఎన్నికల వేళ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కొత్త సైన్యాన్ని ఖరారు చేశారు. పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న జగన్... ఇప్పుడు పార్టీపైన దృష్టి పెట్టారు. జిల్లా అధ్యక్షుల నుంచి కింది స్థాయి వరకు సమూలు మార్పులు చేస్తున్నారు. అందులో భాగంగా కొత్తగా జిల్లా కమిటీలను ప్రకటించారు. రేపో మాపో పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టులు పార్టీ కీలక బాధ్యతల మార్పులను ప్రకటించనున్నారు.
ఎన్నికలకు జగన్ తన ఆర్మీని రంగంలోకి దించుతున్నారు. జిల్లా కార్యవర్గాలను ప్రకటించిన సీఎం జగన్ అందులో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. చిత్తూరు జిల్లా బాధ్యతలను అనూహ్యంగా భరత్కు అప్పగించారు. గోదావరి జిల్లాల్లో కాపు, బీసీ వర్గాలకు నాయకత్వం అప్పగించారు. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి పేర్ని నానిని నియమించారు. టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిన నెల్లూరు జిల్లా బాధ్యతలను రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేటాయించారు.

లోకేష్ యువగళం యాత్రతో సమీకరణాలు మారాయని భావిస్తున్న ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలను అనూహ్యంగా మాజీ మంత్రి వెల్లంపల్లికి కేటాయించారు. ఎస్టీ ఓటింగ్ పై భారీగా ఆశలు పెట్టుకున్న జగన్ పార్వతీపురం మన్యం బాధ్యతలను శత్రుచర్ల పరీక్షిత్ రాజుపై మోపారు. శ్రీకాకుళంలో టీడీపీ వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సమయంలో ధర్మాన కృష్ణదాస్కు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కీలకమైన గోదావరి జిల్లాల్లో కాపు, క్షత్రియ, బీసీ సమీకరణాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారు. మూడు జిల్లాలను కాపు నేతలను అధ్యక్షులుగా నియమించారు. తూర్పుగోదావరి జక్కంపూడి రాజాకు, ఏలూరు జిల్లా ఆళ్ల నాని, కాకినాడ జిల్లాను కురసాల కన్నబాబుకు అప్పగించారు. కోనసీమను పొన్నాడ సతీష్కు కేటాయించిన సీఎం జగన్.. పశ్చిమగోదావరి జిల్లాను మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజుకు అప్పగించారు.
విజయనగరంలో జెడ్పీ ఛైర్మెన్గా ఉన్న మజ్జి శ్రీనివాస్కే జిల్లా బాధ్యతలు కేటాయించారు. కీలకమైన పల్నాడు జిల్లా బాధ్యతలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, కర్నూలు అధ్యక్షులుగా బాలనాగిరెడ్డి, నంద్యాల కాటసాని రాంభూపాల్ రెడ్డి, ప్రకాశం జంకె వెంకటరెడ్డి, వైఎస్సార్ జిల్లా కడప మేయర్ సురేష్ బాబుకు, అల్లూరు జిల్లా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ, అనకాపల్లి బొడ్డేట ప్రసాద్, అనంతపురం పైలా నర్సింహయ్య,అన్నమయ్య జిల్లా గడికోట శ్రీకాంత్ రెడ్డిలకు అప్పగించారు. ఎమ్మెల్యే సీట్లపైన కసరత్తు చేస్తున్న జగన్ సీట్లు దక్కని వారికి ప్రత్యామ్నాయ పదవులతో ముందుగానే సంతృప్తి పరిచే వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఒకటి రెండ్రోజుల్లోనే పార్టీలో కీలక పదవిలతో పాటు నామినేటెడ్ పోస్టులను ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications