డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేసారు : ఆ భారం మోయలేనిదిగా మారింది : సీఎం జగన్ ఫైర్..!!
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రుణాలు మాఫీ చేస్తామని చెప్పి... రుణాలు కట్టొద్దని పిలుపునిచ్చి ఆ తరువాత డ్వాక్రా మహిళలను మోసం చేసారని సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వాళ్ల మాటలు నమ్మిన మహిళలు రుణాలు చెల్లించలేదని..చివరకు వడ్డీలు కూడా చెల్లించలేక తడిసి మోపెడై అక్కాచెల్లెమ్మల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. దీంతో..కట్టలేని ఆ రుణాలను నాలుగు దఫాలుగా ప్రభుత్వమే చెల్లిస్తోందని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.

ప్రయివేటు సంస్థల భాగస్వామ్యం
ప్రయివేటు సంస్థల భాగస్వామ్యంతో మహిళలను ఆదుకోవడమే కాకుండా వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేట్టుగా ఐటీసీ, రిలయన్స్, అమూల్లాంటి దిగ్గజ కంపెనీలను భాగస్వాములను చేసి, వారికి వ్యాపార మార్గాలను చూపించిందన్నారు. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాల వంటి పథకాలతో నిజమైన మహిళా సాధికారితకు, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం దారులు వేస్తోందని సీఎం వివరించారు. మొదటి విడత ఆసరా కింద దాదాపు 8 లక్షల పైచిలుకు డ్వాక్రా గ్రూపులకు రూ.6330.58 కోట్లు మహిళలకు ప్రభుత్వం అందించిందని వివరించారు. దాంతోపాటు రెండో విడత ఆసరా సన్నాహాకాలను అధికారులు వివరించారు.

వ్యవస్థే ఛిన్నాభిన్నం చేసారు
మహిళలను ఆదుకోకపోవడంతో మొత్తం వ్యవస్థే ఛిన్నాభిన్నమయ్యిందని సీఎం పేర్కొన్నారు. చంద్రబాబు వల్లే ఏ గ్రేడ్లో ఉన్న సంఘాలన్నీ కూడా 'సి' గ్రేడ్లోకి పడిపోయాయని... పాదయాత్రలో తాను వెళ్లినప్పుడు ప్రతి మహిళా చేసిన డిమాండ్ .. డ్వాక్రా రుణాల మాఫీ. మా పరిస్థితి బాగోలేదని చెప్పారని గుర్తు చేసారు. మహిళల్లో స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను మళ్లీ ఒకసారి సమీక్షించి మరింతమందికి లబ్ధి చేకూర్చేలా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. రెండో విడత ఆసరాను ఉంచుకుని ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు. ప్రజాప్రతినిధులను కూడా ఇందులో పాల్గొనేలా కార్యక్రమాలను రూపొందించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు.

మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది
ఆసరా కింద ఇచ్చే డబ్బును బ్యాంకులు జమచేసుకోలేని విధంగా అన్ ఇంకబర్డ్ ఖాతాల్లో జమచేయాలి. స్థిర ఆర్థికాభివృద్ధికి తోడ్పడే ఉపాధి మార్గాల కోసం బ్యాంకులు రుణాలు ఇప్పించేలా స్పాట్ డాక్యుమెంటేషన్ జరిగేలా చూడాలి. ఇళ్ల లబ్ధిదారులైన అక్కాచెల్లెమ్మలకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వైఎస్సార్ చేయూతపైన సీఎం సమీక్షించారు. రెండో విడతలో 2,21,598 మంది మహిళలకు ఉపాధి మార్గాల కల్పనకు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మహిళలు చేస్తున్న వ్యాపారాలకు సంబంధించి మార్కెటింగ్ సమస్య ఉత్పన్నం కావొద్దని ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు.
Recommended Video

మహిళలు వ్యాపారాల నిర్వహణలో ముందుండాలి
గతేడాది ప్రాక్టర్ అండ్ గాంబిల్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, రిలయన్స్ రిటైల్, అమూల్, అల్లానాలతో కలిసి సుస్థిర ఆర్థిక ప్రగతి కార్యక్రమాలు చేపట్టినట్లు సీఎం జగన్కు వివరించారు. ఈ ఏడాది రిలయన్స్కు చెందిన అజియో, టనాజెర్, గ్రామీణ వికాస్ కేంద్ర, మహీంద్రా, గెయిన్, కల్గుడి కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు చెప్పారు. ఆసరా, చేయూత కింద మనం ఇచ్చే డబ్బును మహిళలు సుస్థిర జీవనోపాధికి వినియోగించుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశమని సీఎం జగన్ స్పష్టం చేశారు. సుస్థిర జీవనోపాధి మార్గాలతో విజయవంతమైన మహిళల ద్వారా ఇతర మహిళలు స్ఫూర్తి పొందాలని సూచించారు. వారు చేస్తున్న వ్యాపార కార్యకలాపాలు, పశుపోషణ ద్వారా పొందుతున్న ఆదాయాల వివరాలను ఇతర మహిళలకు వివరించాలని అధికారులకు సీఎం నిర్దేశించారు.












Click it and Unblock the Notifications